Delhi: కేజ్రీవాల్ కారుపై రాళ్ల దాడి.. ఆరోపణలు తోసిపుచ్చిన బీజేపీ..

అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ దాడికి పాల్పడిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానానికి ప్రచారం చేస్తుండగా కేజ్రీవాల్ కారుపై ఇటుకలు, రాళ్లతో దాడి చేశారని ఆ పార్టీ ఆరోపించింది. దాడికి సంబంధించిన వీడియోను కూడా పార్టీ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేసింది. మరోవైపు, కేజ్రీవాల్ తన కారుతో ఇద్దరు యువకులను ఢీకొట్టారని బీజేపీ ఆరోపించింది.

Delhi: కేజ్రీవాల్ కారుపై రాళ్ల దాడి.. ఆరోపణలు తోసిపుచ్చిన బీజేపీ..
Kejriwal Car

Updated on: Jan 18, 2025 | 5:29 PM

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ నేత పర్వేష్ వర్మ అనుచరులు దాడి చేశారని శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. కేజ్రీవాల్ కారుపై రాళ్లు రువ్వారని పేర్కొంది. కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీలో ప్రచారం చేస్తున్నప్పుడు ఆయనపై ఈ దాడి జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి.  స్థానికులు జోక్యం చేసుకుని దుండగులను తరిమికొట్టినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఆరోపించిన దాడికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది. ఓటమి భయంతో బీజేపీ భయాందోళనకు గురవుతోందని ఆ పార్టీ పేర్కొంది. అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి చేసేందుకు బీజేపీ తన గూండాలను సిద్ధం చేసింది. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ గూండాలు కేజ్రీవాల్‌ ప్రచారం చేయకుండా ఇటుకలు, రాళ్లతో దాడి చేసి గాయపరిచేందుకు ప్రయత్నించారని ఆ పార్టీ ఆరోపించింది. ఈ పిరికి దాడికి కేజ్రీవాల్ భయపడరని ఆ పార్టీ పేర్కొంది. ఢిల్లీ ప్రజలు మీకు తగిన సమాధానం చెబుతారని హెచ్చరిస్తూ పోస్ట్ పెట్టింది ఆప్.

మరోలా బీజేపీ వెర్షన్

మరోవైపు తమ కార్యకర్తలపై ఆప్ వర్గాలు దాడికి యత్నించాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ ఘటన తర్వాత బీజేపీ నేత పర్వేష్ వర్మ కూడా గాయపడినవారిని పరామర్శించేందుకు లేడీ హార్డింజ్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పవ్రేష్ వర్మ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేశారు. కేజ్రీవాల్ తన కారుతో ఇద్దరు  బీజేపీ కార్యకర్తలను ఢీకొట్టారని ఆరోపించారు.

అయితే, ఢిల్లీ పోలీసు వర్గాల దాడి వార్తలను ఖండించాయి.  ఇరువర్గాలు నినాదాలు చేయడంతో పాటు తోపులాటకు దిగాయని.. గోల్ మార్కెట్ సమీపంలో ఒకరి వాహనాలను ఒకరు ఆపుకునే ప్రయత్నాలు కూడా జరిగాయని తెలిపారు. అయితే పోలీసులు వారిని నిలువరించినట్లు వెల్లడించారు. ఎవరిపైనా దాడి జరగలేదన్నారు.

న్యూఢిల్లీ స్థానంపై త్రిముఖ పోటీ

నిజానికి అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి బీజేపీ మాజీ ఎంపీ పర్వేశ్ వర్మను బరిలోకి దింపింది. అదే సమయంలో కాంగ్రెస్ ఈ స్థానం నుంచి సందీప్ దీక్షిత్‌కు టికెట్ ఇచ్చింది. కేజ్రీవాల్ గత ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన స్థానం న్యూఢిల్లీ. అయితే ఈసారి ఇక్కడ ముక్కోణపు పోటీ కనిపిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..