Taj Mahal: బెదిరింపు మెయిల్స్‌పై కేంద్రం అలర్ట్.. తాజ్‌ మహల్‌లో యాంటీ-డ్రోన్‌ వ్యవస్థ ఏర్పాటు!

ప్రపంచంలోనే అద్భుత కట్టడాల్లో ఒకటైన తాజ్‌మహల్‌కు ముప్పు తలబెడతామన్న బెదిరింపులు రావడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. గగనతల దాడులను దీటుగా ఎదుర్కొని తాజ్‌మహాల్‌ను కాపాడేందుకు అధునాతన యాంటీ డ్రోన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు తాజ్‌ మహల్‌ ప్రాంగణంలో యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఇది సుమారు 7 నుంచి 8 కిలోమీటర్ల రేడియస్‌లో వచ్చే ముప్పులను కూడా గుర్తించనుంది.

Taj Mahal: బెదిరింపు మెయిల్స్‌పై కేంద్రం అలర్ట్.. తాజ్‌ మహల్‌లో యాంటీ-డ్రోన్‌ వ్యవస్థ ఏర్పాటు!
Taj Mahal

Updated on: May 26, 2025 | 10:09 AM

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో మళ్లీ ఇలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడిక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. అయితే ఈ ఉద్రిక్తతల తర్వాత తాజాగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కట్టడమైన తాజ్‌మహల్‌కు ముప్పు తలబెడతామన్నట్టు కొన్ని బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో అలర్ట్‌ అయిన కేంద్ర ప్రభుత్వం, గగనతల దాడుల నుంచి తాజ్‌మహల్‌ను రక్షించేందుకు అధునాత యాంటీ డ్రోన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజ్‌ మహల్ ప్రాంగణంలో యాంటీ డ్రోన్‌ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు అదివారం అధికారులు వెల్లడించారు.

ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థ తాజ్‌ మహల్ ప్రాంగణం నుంచి సుమారు 7 నుంచి 8 కి.మీ పరిధిలో పనిచేస్తుందని అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతానికి ప్రధాన గోపురం నుంచి 200 మీటర్లు పరిధిలో మాత్రమే ప్రభావవంతంగా పనిచేసేలా దీన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ అధునాతన యాంటీ డ్రోన్‌ వ్యవస్థ అది ఉన్న ప్రాంతంలోని గగనతలంలోకి ఏవైనా అనుమానిత డ్రోన్‌లు ప్రవేశిస్తే వాటిని గుర్తించి, వెంటనే వాటి సిగ్నల్స్‌ను జామ్‌ చేస్తుంది. తద్వారా ఆ డ్రోన్లను పనిచేయకుండా చేస్తుంది.

అయితే, ఈ యాంటీ డ్రోన్‌ సిస్టమ్ ఎలా పనిచేస్తుందనే దానిపై ఇప్పటికే సంబంధించి పోలీసు సిబ్బందికి శిక్షణ ఇప్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ వ్యవస్థను ఆపరేట్ చేయడం కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామన్నాని.. ఈ ప్రక్రియ అతి త్వరలోనే పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు, తాజ్​మహల్‌కు వచ్చిన బెదిరింపులపై కూడా స్థానిక సైబర్‌క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. తాజాగా కేరళలోనూ ఇంలాంటి బెదిరింపులు వచ్చాయని.. ఆ విషయంపై కేరళ పోలీసులను సంప్రదిస్తూ దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నట్టు ఏసీపీ సయ్యద్‌ ఆరిబ్‌ అహ్మద్‌ తెలిపారు.

మరోవైపు నిత్యం ప్రపంచ దేశాల పర్యాటకులు తాజ్‌ మహాల్‌ సందర్శనకు వస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన ఏర్పాటు చేశామని అక్కడ భద్రతా చర్యలు నిర్వహించే సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, యూపీ పోలీసులు తెలిపారు. ఇక్కడికి వచ్చే వారిని ఎప్పటికప్పుడూ తనిఖీ చేస్తూ
పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..