Big Story: రూ. 14,500 కోట్ల స్కామ్… కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ఇంటికి ఈడీ !

| Edited By: Pardhasaradhi Peri

Jun 30, 2020 | 6:06 PM

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ రూ. 14,500 కోట్ల స్కామ్ లో చిక్కుకున్నారు. ఈడీ అధికారులు మంగళవారం రెండో దఫా ఢిల్లీ లోని ఆయన ఇంటికి చేరుకొని ఈ స్కామ్ పై ప్రశ్నించడం..

Big Story: రూ. 14,500 కోట్ల స్కామ్... కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ఇంటికి ఈడీ !
Follow us on

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ రూ. 14,500 కోట్ల స్కామ్ లో చిక్కుకున్నారు. ఈడీ అధికారులు మంగళవారం రెండో దఫా ఢిల్లీ లోని ఆయన ఇంటికి చేరుకొని ఈ స్కామ్ పై ప్రశ్నించడం ప్రారంభించారు. సందేశరా బ్రదర్స్ బ్యాంక్ ఫ్రాడ్, మనీ లాండరింగ్ కేసులకు సంబంధించి రెండో సారి వారు ఆయనను విచారిస్తున్నారు. మొదట ఈ నెల 27 న ఎనిమిది గంటల పాటు విచారించినప్పటికీ.. మనీ లాండరింగ్ చట్టం కింద మళ్ళీ ఆయన వాంగ్మూలాన్ని సేకరించారు. కోవిడ్-19 గైడ్ లైన్స్ కారణంగా తాను ఈడీ కార్యాలయానికి రాలేనని చెప్పినందున అధికారులే స్వయంగా పటేల్ ఇంటికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కోశాధికారి గాను, లోగడ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రాజకీయ కార్యదర్శి గాను వ్యవహరించిన 70 ఏళ్ళ అహ్మద్ పటేల్ ఈ స్కామ్ లో చిక్కుకోవడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.

మనీలాండరింగ్ కేసులో రూ. 14,500 కోట్ల బ్యాంక్ లోన్ ఫ్రాడ్ వార్తల్లోకి వెళ్తే.. గుజరాత్ వడోదర లోని స్టెర్లింగ్ బయో టెక్ ప్రమోటర్లు, డైరెక్టర్లయిన నితిన్ జయంతిలాల్, సందేశరా, చేతన్ కుమార్ జయంతి లాల్ సందేశరా, దీప్తి  సందేశరా అనే వ్యక్తులు ఆంద్ర బ్యాంకు ఆధ్వర్యంలోని ఓ డొమెస్టిక్ కన్సార్టియం నుంచి రూ.5,383 కోట్ల రుణం  తీసుకున్నారు. అయితే ఆ కన్సార్టియం ఆ తరువాత నిరర్థక ఆస్తులుగా మారింది. (వీరిలో నితిన్, చేతన్ కుమార్ సోదరులు). వీరంతా గుజరాత్ నుంచి పరారై అల్బేనియా చేరుకున్నారని, వీరిని అక్కడి నుంచి రప్పించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిసింది. సీబీఐ, ఐటీ సంస్థల నుంచి కూడా వీరు దర్యాప్తును ఎదుర్కోనున్నారు. కొందరు ఉన్నత స్థాయి రాజకీయ నేతలతో కుమ్మక్కయిన వీరు.. అవినీతికి పాల్పడ్డారని, పన్ను ఎగవేశారన్న ఆరోపణలు వీరిపై ఉన్నాయి. సీబీఐ దాఖలు చేసిన ఛార్జి షీట్ ఆధారంగా ఈడీ వీరిపై క్రిమినల్ కేసు కూడా పెట్టింది. సందేశరా గ్రూప్ లో పని చేసే సునీల్ అనే ఉద్యోగి.. సందేశరా బ్రదర్స్ తో బాటు ఇర్ఫాన్ అనే వ్యక్తి కూడా తరచూ అహ్మద్ పటేల్ ఇంట్లో సమావేశమయ్యేవాడని, ఈ సమావేశాల్లో అహ్మద్ పటేల్ కుమారుడు ఫైసల్ పటేల్ కూడా పార్టిసిపేట్ చేసేవాడని పేర్కొన్నట్టు తెలిసింది. అంటే ఈ వ్యవహారమంతా అహ్మద్ పటేల్ కి తెలిసే ఉంటుందని భావిస్తున్నారు. ఫైసల్ పటేల్ ను ఆ మధ్య ఈడీ విచారించింది.

పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫ్రాడ్ కన్నా ఇది పెద్దదని అంటున్నారు, రూ. 13,400 కోట్ల ఆ కుంభకోణంతో ప్రమేయమున్నట్టు భావిస్తున్న వజ్రాల వ్యాపారులు నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ దేశం విడిచి పరారైన సంగతి విదితమే. కాగా.. చైనా దురాక్రమణ, కరోనా వైరస్ వంటివాటిపై పోరాటం జరిపే బదులు ఈ ప్రభుత్వం ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తోందని అహ్మద్ పటేల్ ఆరోపించారు.