Adani Group Controversy: కాంగ్రెస్‌ చిల్లర రాజకీయాలు చేస్తోంది.. జైరాం రమేష్ ట్వీట్‌కు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఎదురుదాడి

అదానీ గ్రూప్‌పై హిండెన్‌ బర్గ్ రిపోర్ట్‌ ప్రకంపనలు సృష్టిస్తోంది. 15రోజులుగా దుమారం చెలరేగుతోంది. పార్లమెంట్‌నూ కుదిపేస్తోంది హిండెన్‌బర్గ్‌ నివేదిక. ఆ రిపోర్ట్‌పై చర్చకు పట్టుబడుతున్నాయి విపక్షాలు. కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి.

Adani Group Controversy: కాంగ్రెస్‌ చిల్లర రాజకీయాలు చేస్తోంది.. జైరాం రమేష్ ట్వీట్‌కు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఎదురుదాడి
Jairam Ramesh And Pralhad Joshi

Updated on: Feb 06, 2023 | 5:05 PM

పార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరును తప్పుపట్టారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి. అదానీ హిండెన్‌బర్గ్ వ్యవహారంపై చర్చకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఉభయ సభలను అడ్డుకోవం సరిగ్గాలేదని హితవు పలికారు. కాంగ్రెస్‌కు ప్రజానుకూల చట్టాలతో సంబంధం లేదని అన్నారు. కాంగ్రెస్ లేవనెత్తుతున్న సమస్యలను ఆర్ధిక మంత్రి పదేపదే మాట్లాడుతున్నారు. నేడు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గుర్తించాయన్నారు. కాంగ్రెస్ దీనిని జీర్ణించుకోలేక చిల్లర రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తోందని జోషి కాంగ్రెస్‌పై ఎదురుదాడికి దిగారు.

పార్లమెంట్‌ వ్యవహారాలపై కాంగ్రెస్ కనీసం ఆసక్తి చూపలేదని.. ప్రజానుకూల చట్టాలను తీసుకురావడం గురించి వారు పట్టించుకోవడం లేదన్నారు. మోడీ ప్రభుత్వ హయాంలో పార్లమెంట్ చారిత్రాత్మక ఉత్పాదకతను వారు అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు ప్రహ్లాద్ జోషి. గత తొమ్మిదేళ్లలో కాంగ్రెస్ అన్ని పార్లమెంటరీ సంప్రదాయాలను అగౌరవపరిచిందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విమర్శించారు.

వారి నాయకులు పార్లమెంటుకు హాజరు కాకుండా విదేశాలలో సెలవులను ఇష్టపడుతున్నారని.. గౌరవనీయులైన రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించిన చేసిన ప్రసంగానికి దూరంగా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం చూస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీరు రాష్ట్రపతిని అవమానించినట్లే అని అన్నారు. అభివృద్ధి ఆధారిత బడ్జెట్‌కు ప్రభుత్వం ప్రశంసలు అందించాల్సి వస్తుందనే భయంతో పార్లమెంటును నడపడానికి కాంగ్రెస్ దూరంగా ఉందన్నారు.


ఇదే అంశంపై వంతుగా మూడు తాజా పోస్టులను చేసింది కాంగ్రెస్ పార్టీ. రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ విప్ జైరాం రమేష్ మాట్లాడుతూ, “ప్రధానమంత్రికి అనుసంధానించబడిన అదానీ మహామెగా స్కామ్‌లో జేపీసీకి తమ న్యాయబద్ధమైన డిమాండ్‌ను పార్లమెంటులో ప్రస్తావించడానికి కూడా ప్రతిపక్షాలు వరుసగా మూడవ రోజు కూడా అనుమతించలేదు. మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. మోదీ ప్రభుత్వం పారిపోతోందంటూ విమర్శించారు.

అదానీ గ్రూప్‌పై హిండెన్‌ బర్గ్ రిపోర్ట్‌ ప్రకంపనలు సృష్టిస్తోంది. 15రోజులుగా దుమారం చెలరేగుతోంది. పార్లమెంట్‌నూ కుదిపేస్తోంది హిండెన్‌బర్గ్‌ నివేదిక. ఆ రిపోర్ట్‌పై చర్చకు పట్టుబడుతున్నాయి విపక్షాలు. మల్లికార్జునఖర్గే చాంబర్‌లో సమావేశమైన ప్రతిపక్షాలు..భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు.

అనంతరం పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర ఆందోళనకు దిగారు. హిండెన్‌బర్గ్‌ నివేదికపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేయాలని.. లేదంటే సుప్రీంకోర్ట్‌ పర్యవేక్షణలో విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తూ బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

Loading...
Unable to load recommendations.
Follow Us