
ఒకరినొకరు అర్థం చేసుకునేందుకని సహజీవనం చేస్తూ ప్రియుడి చేతిలో అమ్మాయిలు బలైపోతున్న ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. గతంలో ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఇటీవలే బెంగళూరులోని ఇద్దరు ప్రేమికులు సహజీవనం చేస్తుండగా.. యువకుడు తన ప్రియురాలి గొంతునులిమి హత్య చేయడం కలకలం రేపింది. ఈ ఘటనలు మరవకముందే ఇప్పుడు తాజాగా ముంబయిలో మరో దారుణం చోటుచేసుకుంది. సహజీవన భాగస్వామిని హత్య చేసిన ఓ వ్యక్తి ఆమె శరీర భాగాల్ని ముక్కలుముక్కలుగా చేశాడు. వివరాల్లోకి వెళ్తే ముంబయిలోని గీతానగర్లో మనోజ్ సహాని(53) అనే వ్యక్తి సరస్వతి(36) అనే మహిళతో మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు.
అయితే వీళ్లిద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. అవి కాస్త పెద్దవవడంతో మనోజ్ విసిగిపోయాడు. చివరికి ఆమెను హత్య చేశాడు. అనంతరం చెట్లు కోసే మిషన్తో ఆమె మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా కోశాడు. అంతేకాదు రోజూ వాటిని ప్రెషర్ కుక్కర్లో ఉడకబెడుతున్నాడు. అయితే బుధవారం వాళ్లు ఉంటున్న ఇంట్లో నుంచి దుర్వాసన రావడాన్ని పొరిగింటి వారు గమనించారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లి చూడటంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనంతరం నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నాలుగురోజుల క్రతమే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. హత్యకు గల కారణాలు తెలుసుకుంటున్నామని.. మనోజ్ సహానితో పాటు మరో ఇద్దరు అనుమానితుల్ని కస్టడీలోకి తీసుకున్నామని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..