ఘోర రోడ్డు ప్రమాదం.. అగ్నికి ఆహుతైన ఆర్టీసీ బస్సు! ఆరుగురు ప్రయాణికులు మృతి
గుజరాత్ లోని బర్దోలీ దగ్గర రెండు బస్సులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందగా.. 20 మందికి పైగా తీవ్రగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. సూరత్ జిల్లా బర్డోలిలోని ఊవా గ్రామం సమీపంలో మహారాష్ట్ర రిజిస్ట్రేషన్తో ఉన్న ఆర్టీసీ బస్సు మరో ఆర్టీసీ బస్సును..

బర్దోలీ, జూన్ 2: గుజరాత్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బర్దోలీ దగ్గర రెండు బస్సులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందగా.. 20 మందికి పైగా తీవ్రగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. సూరత్ జిల్లా బర్డోలిలోని ఊవా గ్రామం సమీపంలో మహారాష్ట్ర రిజిస్ట్రేషన్తో ఉన్న ఆర్టీసీ బస్సు మరో ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఢీకొన్న ధాటికి బస్సుల్లో ఒకటి అదుపుతప్పి, డివైడర్ను దాటి రోడ్డుకు అవతలి వైపు బోల్తా పడింది. అక్కడ దానికి మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయింది.
సాయంత్రం 4 గంటల తర్వాత ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న సూరత్ రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు సూరత్ రూరల్ ఎస్పీ రాజేష్ గధ్వీ, రేంజ్ ఐజీ ప్రేమ్వీర్ సింగ్ తెలిపారు. గాయపడిన ప్రయాణికులను చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికులలో ఎక్కువ మంది మహారాష్ట్ర నివాసితులు.
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాయి. సహాయక బృందాలు, పోలీసు సిబ్బంది, స్థానిక నివాసితులు కలిసికట్టుగా పనిచేసి బస్సుల్లో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అగ్నిప్రమాదంలో బస్సు తీవ్రంగా దెబ్బతింది. సహాయక చర్యలు పూర్తయిన తర్వాత మృతుల సంఖ్యపై స్పష్టమైన వివరాలు వెల్లడవుతాయని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
