
లావుగా ఉందని, పిల్లలు పుట్టడం లేదనే కారణంతో ఓ ఇళ్లాలిని వేధింపులకు గురిచేస్తూ హత్య చేశాడు ఓ భర్త. ఈ ఘటన కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రియాంక కమలాకర్ అనే యువతికి రెండేళ్ల క్రితం బసవరాజ్ వడ్డార్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే పెళ్లయిన కొన్ని వారాలకే భర్త అదనపు వరకట్నం కోసం ఆమెను వేధించడం స్టార్ట్ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు రేణవ్వ, సుభాష్, సిద్దరామేశ్ సైతం పట్టింటి నుంచి డబ్బు, బంగారం తీసుకురావాలని ప్రియాంకపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది.
అంతేకాకుండా.. “నువ్వు నీ భర్త కంటే లావుగా ఉన్నావు, ఇంకా గర్భం ఎందుకు రాలేదు?” అంటూ ఆమె రూపాన్ని, బరువును అవహేళన చేస్తూ నిరంతరం ప్రియాంకను మానసికంగా కుంగదీశారు. ఇలా పెళ్లయిన నాటి నుంచి ప్రియాంక అత్తింటి వారి చేతిలో చిత్రహింసలు అనుభవిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి భర్త బసవరాజ్ ఇంట్లో ఉన్న భార్య ప్రియాంక గొంతు నులిమి హత్య చేశాడు. ఈ విషయం రెండు రోజుల తర్వాత ప్రియాంక కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా మరికొన్ని షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. ప్రియాంక కుటుంబ సభ్యుల ప్రకారం.. పెళ్లయిన తర్వాత ప్రియాంక రెండుసార్లు గర్భం దాల్చింది. కానీ భర్త తరచూ ఆమెపై దాడి చేయడంతో, ఆ దెబ్బల కారణంగానే రెండు సార్లూ గర్భస్రావం (మిస్క్యారేజ్) అయిందని ఆరోపించారు. దీనికి తోడు ఆమె లావుగా ఉందని, తనకు నచ్చలేదనే నెపంతో భర్త తరచూ ప్రియాంకను వేధించేవాడని తెలిపారు. అయితే ఈ గర్భస్రావాల ఆరోపణలను పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రధాన నిందితుడైన భర్త బసవరాజ్ వడ్డార్తో పాటు అతని కుటుంబ సభ్యులు రేణవ్వ, సుభాష్, సిద్దరామేశ్లను అరెస్ట్ చేశారు. వీరిపై హత్య, కట్నం వేధింపులు సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.