
ఇదే విధంగా మన ఆత్మ ఈ భౌతిక ప్రపంచంలో రకరకాల ఆకర్షణల వల్ల దారి తప్పే ప్రమాదంలో ఉంటుంది. మనిషిగా పుట్టడం మన ఆత్మకు లభించిన ఒక అరుదైన అవకాశం. ఈ శరీరం రూపంలో మనం ఆత్మగా పరమాత్మతో ఒక్కటయ్యే సువర్ణావకాశం పొందుతాం. కానీ ప్రపంచంలోని భౌతిక, భావోద్వేగ, మానసిక ఆకర్షణలు మన అసలైన దైవిక లక్ష్యాన్ని మర్చిపోయేలా చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మను ఈ ప్రపంచపు అశాంతి నుండి కాపాడే కవచం.. అదే ఆత్మ రక్షణ కారకం (Soul Protection Factor)
మన శరీరంలో ఆత్మతో పాటు మనస్సు ఉంటుంది. ఈ మనస్సు ఎప్పుడూ ఎలాంటి ఆనందమైనా వెతుకుతుంది. ఇది చురుకుగా బయటి ప్రపంచంలోని సుఖాలకు, ఆసక్తులకు మన దృష్టిని లాగుతుంది. దీని వల్ల మనం భౌతిక అవసరాలు, భావోద్వేగ కోరికలు, జ్ఞాన సంబంధిత ఆశయాలలో మునిగిపోయి, ఆత్మను తక్కువగా గుర్తించగలుగుతున్నాం.
ఈ మానవ జన్మ మనకు దైవసమ్మతిగా వచ్చిన గొప్ప అవకాశం. దీన్ని గుర్తించగానే మనలో ఆధ్యాత్మిక జ్ఞానం ప్రారంభమవుతుంది. మన నిజమైన స్వరూపం ఆత్మనే అనే జ్ఞానం కలిగినప్పుడే ధ్యానాన్ని సాధన చేయడానికి మన మనస్సు సిద్ధమవుతుంది. ఇది ఒక అద్భుతమైన, పవిత్రమైన మార్పుకు ఆరంభం అవుతుంది.
ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం ఒక ఆధ్యాత్మిక గురువు ద్వారా మార్గదర్శనం పొందాలి. గురువు ధ్యానం పద్ధతిని నేర్పిస్తూ మన ఆత్మను లోపలికి తిప్పే మార్గాన్ని చూపిస్తారు. బయటి ప్రపంచాన్ని వదిలి లోపలికి దృష్టిని నిలిపినప్పుడు.. మనం శాంతంగా ఉండే అంతర్లోకంలోకి ప్రవేశిస్తాం. అక్కడ దేవుని శబ్దాన్ని, దైవిక కాంతిని అనుభవించే అవకాశం ఉంటుంది.
ఈ లోపలి అనుభవాల వల్ల బయటి ప్రపంచపు బాధలు, ఊహలు మనపై ప్రభావం చూపడం తగ్గుతుంది. మన ఆత్మ లోపల ప్రకాశించే సూర్య కిరణాలలో స్నానం చేస్తుంది. ఈ కాంతి ఎండలా కాల్చే కిరణాలు కావు.. ఇవి మృదువుగా మన హృదయాన్ని తాకుతూ ఆనందాన్ని, విశ్రాంతిని అందిస్తాయి. మన జీవితంలో ఏ అల్లకల్లోలాలు వచ్చినా మనల్ని కలవరపరచలేవు.. ఎందుకంటే మన ఆత్మ దైవిక శాంతితో నిండి ఉంటుంది.
అందుకే ధ్యానం మన ఆత్మకు ఒక రక్షణ కవచంలా పని చేస్తుంది. ఇది మనలో అంతర్గత స్థిరత్వాన్ని సృష్టించి, మానవ జీవితంలో అసలైన ప్రయోజనాన్ని.. పరమాత్మతో ఐక్యతను, పూర్తిగా తెలుసుకునే దిశగా మనల్ని నడిపిస్తుంది.