
భారతదేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ను కలిగి ఉంది. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు, టన్నుల కొద్దీ సరుకు రవాణా రైళ్ల ద్వారానే సాగుతుంది. నేటి సాంకేతిక యుగంలో బుల్లెట్ రైళ్లు, వందే భారత్ వంటి హై-స్పీడ్ రైళ్లు గంటల వ్యవధిలోనే వందల కిలోమీటర్ల దూరాన్ని దాటేస్తున్నాయి. కానీ, వీటన్నింటికీ భిన్నంగా.. దాదాపు సైకిల్ వేగంతో ప్రయాణించే ఒక ప్రత్యేకమైన రైలు మన దేశంలో ఉందని మీరు తెలుసా? అవును ఈ ట్రైన్లో జర్నీ చేసేందుకు జనాలు రోజులు తరబడి వేచి చూస్తుంటారు. ఎందుకంటే ఈ ట్రైన్లో జర్నీ అంత ఆహ్లాదకరంగా ఉంటుందట.. పచ్చని ప్రకృతి నడుమ నెమ్మదిగా సాగే ప్రయాణం కోసం ఎంతో మంది జనాలు దీన్ని ఎక్కడానికి ఇష్టపడుతారట.
అదే భారతదేశంలోనే అత్యంత నెమ్మదైన రైలుగా గుర్తింపు పొందిన మెట్టుపాళయం ఊటీ ప్యాసింజర్ రైలు.. దీనినే స్థానికంగా ఊటీ టాయ్ ట్రైన్ అని పిలుస్తారు. ఈ రైలు గంటకు కేవలం 9 నుండి 12 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది. అంటే మనం సైకిల్ మీద ప్రయాణించిన వేగంతో సమానం. అయితే, ఈ తక్కువ వేగమే ఈ రైలుకు అతిపెద్ద ప్లస్ పాయింట్. ఎందుకంటే చుట్టూ ఉండే ప్రకృతి అందాలను ప్రయాణికులు కళ్లారా వీక్షిస్తూ, నిరిభ్యంతరంగా ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి ఈ వేగం ఎంతగానో సహకరిస్తుంది.
యునెస్కో గుర్తింపు పొందిచిన ట్రైన్
కేవలం ప్రయాణమే కాకుండా, చారిత్రక ప్రాముఖ్యత, అద్భుతమైన దృశ్యాల కారణంగా ఈ రైలుకు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు లభించింది. ఈ ట్రైన్ మార్గం మొత్తం 46 కిలో మీటర్లు ఉండగా.. దీన్ని చేరుకోవడానికి ఈ ట్రైన్కు సుమారు 5 గంటల సమయం పడుతుంది. ఈ ట్రైన్ వెళ్లే మార్గంలో మొత్తం 208 వంపులు, 16 సొరంగాలు, పచ్చని లోయలు, జలపాతాలు వస్తాయి. ఇవి ట్రైన్లో ప్రయాణించే ప్రయాణికులను ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అందుకే ఈ ట్రైన్లో ప్రయాణించేందుకు చాలా మంది రోజులు తరబడి వేచి చూస్తూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో కాస్త పీస్ఫుల్ సమయం గడపాలనే వారికి ఇది ఎంతో ప్రశాంతను ఇస్తుంది
ఈ రైలులో ఎలా ప్రయాణించాలి?
ఈ అద్భుతమైన నీలగిరి పర్వత రైల్వే ట్రైన్లో మీరు ప్రయాణించాలనుకుంటే, ముందుగా మీరు తమిళనాడులోని ఊటీకి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ రైలు ప్రతిరోజూ ఉదయం 7:10 గంటలకు మెట్టుపాళయం నుండి బయలుదేరి, కూనూర్, వెల్లింగ్టన్ మీదుగా మధ్యాహ్నం 12:00 గంటలకు ఊటీ స్టేషన్కు చేరుకుంటుంది. ఈ రైలుకు ఉండే విపరీతమైన క్రేజ్ కారణంగా, సీట్లు త్వరగా నిండిపోతాయి. కాబట్టి ప్రయాణించాలనుకునే వారు 2 నుండి 3 నెలల ముందే టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఉత్తమం.
మొత్తంగా జీవితంలో ఒక్కసారైనా ప్రయాణించాల్సిన అద్భుతమైన రైలు ప్రయాణాలలో ఈ రైల్వే జర్నీ కూడా ఒకటి. పట్టణాల్లో వినిపించే హారన్ శబ్ధాలు, ఆఫీస్ పంచాయతీలకు దూరంగా ప్రకృతిని ప్రేమిస్తూ, ప్రశాంతంగా ప్రయాణించాలనుకునే వారికి ఈ ఊటీ టాయ్ ట్రైన్ జర్నీ ఒక వరం లాంటిదనే చెప్పాలి.
మరిన్ని టూరిజం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.