
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) ప్రయాణికుల కోసం రైళ్లల్లో అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. రైళ్లల్లో టికెట్ల బుకింగ్, ఫుడ్ సేవలతో పాటు పర్యాటకులకు ఉపయోగపడేలా టూరిజం ప్యాకేజీలను కూడా తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రదేశాలను ప్రజలు సులువుగా సందర్శించేలా అనేక ప్రత్యేక ప్యాకేజీలను తక్కువ ధరలో తీసుకొస్తుంది. వీటి ద్వారా తెలియని టూరిస్ట్ ప్రదేశాలకు వెళ్లాలనుకుంటే ఎలాంటి ఆందోళన లేకుండా వెళ్లి రావచ్చు. ఎప్పటికప్పుడు టూరిస్టుల కోసం కొత్త ప్యాకేజీలను తీసుకొస్తున్న ఐఆర్సీటీసీ.. తాజాగా మరో స్పెషల్ ప్యాకేజ్ ప్రవేశపెట్టింది. అదే కోస్టల్ కర్ణాటక ప్యాకేజ్ టూర్. సంక్రాంతి సెలవుల్లో కుటుంబం లేదా ఫ్రెండ్స్తో టూర్కి వెళ్లాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. ఈ టూర్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కోస్టల్ కర్ణాటక పేరుతో ఐఆర్సీటీసీ తీసుకొచ్చిన ఈ ప్యాకేజీ ద్వారా ఉడుపి, శృంగేరి, మురుడేశ్వర్, మంగుళూరు ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ టూర్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. 6 రోజుల పాటు టూర్ కొనసాగుతోంది. ప్రతీ మంగళవారం నుంచి ఈ టూర్ ప్రారంభమవుతుంది. కాచిగూడ నుంచి ట్రైన్ బయల్దేరుతుంది.
స్లీపర్ క్లాస్లో సింగిల్ పర్సన్కు రూ.38,60, డబుల్ షేరింగ్కు 20,650, త్రిబుల్ షేరింగ్ రూ.15,970, ఛైల్డ్ విత్ బెడ్ రూ.9,100, ఛైల్డ్ వితౌట్ బెడ్ రూ.7,720గా ఉంది. ఇక థర్డ్ ఏసీ క్లాసులో సింగిల్ పర్సన్కు రూ.41,630, డబుల్ షేరింగ్కు 23,670, త్రిబుల్ షేరింగ్ రూ.19,000, ఛైల్డ్ విత్ బెడ్ రూ.12,140, ఛైల్డ్ వితౌట్ బెడ్ రూ.10,740గా ఉంది.
మంగళవారం ఉదయం కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి రైలు బయల్దేరి బుధవారం ఉదయం 9.15 గంటలకు మంగళూరుకు చేరుకుంటుంది. ఆ రోజు ఉడిపి, శ్రీకృష్ణ టెంపుల్ సందర్శనలు ఉంటాయి. ఇక గురువారం మూకాంబిక ఆలయం, మురుడేశ్వర్లో శివుడి ఆలయం దర్శనం, గోకర్ణ సందర్శనలు ఉంటాయి. శుక్రవారం హోర్నాడు అన్నపూర్ణ ఆలయం, శృంగేరి శారదాంబ ఆలయం దర్శనం కల్పిస్తారు. ఇక శనివారం మంగుళూరులో మంగళాదేవి ఆలయం, కాద్రిమంజునాథ ఆలయం, తన్నీర్భవి బీచ్, గోకర్ణాథ టెంపుల్ సందర్శనాలు ఉంటాయి. ఆదివారం తిరిగి కాచిగూడకు చేరుకుంటారు.