రామయ్య – రాబందు నీతి కథ: ఇతరులకు చేసిన మేలు ఎప్పటికైనా తిరిగి వస్తుంది..!

A Moral Story: నీతి కథలు పిల్లలతో పాటు పెద్దల్లో మంచి వ్యక్తిత్వాన్ని పొందేందుకు దోహదపడుతాయి. ఇక్కడిచ్చిన నీతి కథలో రామయ్య అనే ఓ రైతు ఒకరోజు వలలో చిక్కుకున్న రాబందును కాపాడాడు. తరువాత అదే రాబందు, పాము నుంచి రామయ్య ప్రాణాలను రక్షించి తన కృతజ్ఞతను చాటింది. ఈ కథ మనకు “మంచి చేసినవారికి మంచి తప్పక తిరిగి వస్తుంది” అనే గొప్ప నీతిని తెలియజేస్తుంది.

రామయ్య – రాబందు నీతి కథ: ఇతరులకు చేసిన మేలు ఎప్పటికైనా తిరిగి వస్తుంది..!
A Moral Story
Image Credit source: AI

Updated on: May 25, 2026 | 1:58 PM

నీతి కథలు చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే జీవిత పాఠాలను అందిస్తాయి. పంచతంత్రం, అక్బర్-బీర్బల్ కథలు వంటి ఎన్నో నీతి కథలు మన సంస్కృతిలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. ఇవి కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, పిల్లల్లో మంచి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే విలువైన సాధనాలు కావడం విశేషం. పిల్లల మనసు మృదువుగా ఉంటుంది. చిన్న వయసులో చెప్పే నీతి కథలు వారి ఆలోచనలపై గాఢమైన ప్రభావం చూపుతాయి. నీతి కథల ద్వారా నిజాయితీ, క్రమశిక్షణ, దయ, సహాయం, కృతజ్ఞత వంటి మంచి గుణాలు పిల్లల్లో పెరుగుతాయి. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేస్తే.. అది మనకు ఎలా తిరిగివస్తుందో తెలిపే ఓ నీతి కథను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ నీతి కథను మనం వెంటనే చదివేద్దాం..

కథ

రామయ్య అనే కష్టపడి పనిచేసే రైతు ఉండేవాడు. అతను ప్రతిరోజూ తన పొలంలో కష్టపడుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు ఉదయం తన పొలం దున్నటానికి వెళ్లిన రామయ్యకు అక్కడ ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. ఒక పెద్ద రాబందు వేటగాళ్లు వేసిన వలలో చిక్కుకుని విలవిలలాడుతోంది. అది బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడక విలవిలలాడుతూ కనిపించింది.

వలలో చిక్కుకున్న ఆ రాబందు దుస్థితిని చూసి రామయ్య హృదయం కరిగిపోయింది. “ప్రాణం అన్నది అందరికీ ఒక్కటే” అని భావించిన అతను వెంటనే వల దగ్గరకు వెళ్లి జాగ్రత్తగా దానిని తొలగించాడు. కొద్దిసేపటికే రాబందు స్వేచ్ఛగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. రామయ్య తన పని చేసుకుంటూ ఆ విషయాన్ని మరిచిపోయాడు.

ఇవి కూడా చదవండి

మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ తీవ్రంగా ఉండటంతో రామయ్యకు బాగా అలసటగా అనిపించింది. దగ్గరలో ఉన్న ఒక పాత గోడ నీడలో కాసేపు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అక్కడే పడుకుని గాఢనిద్రలోకి జారిపోయాడు. అయితే, ఆ గోడ తొర్రలో ఒక విషపూరిత పాము ఉందని అతనికి తెలియదు.

కొద్దిసేపటికే ఆ పాము బయటకు వచ్చి నిద్రిస్తున్న రామయ్యను కాటు వేయడానికి ముందుకు వచ్చింది. అదే సమయంలో ఆకాశంలో ఎగురుతున్న రాబందు తనకు ప్రాణభిక్ష పెట్టిన రైతుకు ప్రమాదంలో ఉండటాన్ని గమనించింది. రామయ్యను రక్షించేందుకు అది ఒక్కసారిగా కిందికి దూసుకొచ్చింది. తన బలమైన కాళ్లతో పామును ఎత్తుకుని దూరంగా తీసుకెళ్లింది.

ఈ సంఘటనతో రామయ్య ఒక్కసారిగా నిద్రలేచాడు. జరిగిన విషయం అర్థమై అతను ఆశ్చర్యపోయాడు. తాను చేసిన చిన్న సహాయం తన ప్రాణాలను కాపాడిందని గ్రహించి ఆ రాబందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపాడు.

నీతి

మనం ఇతరులకు చేసే మేలు ఎప్పటికైనా మనకే సహాయంగా తిరిగి వస్తుంది. మంచి పని ఎప్పుడూ వృథా కాదు. ఒక మంచి పని మరో మంచి పనికి ప్రోత్సహిస్తుంది.

నీతి కథలు మనిషిని మంచి మార్గంలో నడిపించే జీవిత గురువులాంటివి. నీతి కథలు చదవడం వల్ల మంచి వ్యక్తిత్వం, సానుకూల ఆలోచనలు, నైతిక విలువలు పెంపొందించవచ్చు. అందుకే ప్రతి ఇంట్లో, ప్రతి పాఠశాలలో నీతి కథలకు ప్రత్యేక స్థానం ఇవ్వాలి.

Follow Us