
భారతదేశంలో టీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అదొక ఎమోషన్. ఉదయం కాస్త అలసటగా అనిపించినా, సాయంత్రం స్నేహితులతో ముచ్చటించాలన్నా ఒక కప్పు స్ట్రాంగ్ టీ ఉండాల్సిందే. అయితే, మీ ఇష్టమైన ఈ టీ పొడి అసలైనదేనా? లేక అందులో విషపూరిత రసాయనాలు ఏమైనా కలిసి ఉన్నాయా? అంటే అవుననే అంటున్నాయి నివేదికలు. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువ లాభాల కోసం రసాయన రంగులు, వాడేసిన టీ పొడిని ఎండబెట్టి మళ్లీ రంగులు వేయడం, బరువు పెరగడానికి ఇనుప రజను కలపడం వంటి కల్తీలు జరుగుతున్నాయి.
ఇది అత్యంత సులభమైన, కచ్చితమైన పద్ధతి. ఒక గ్లాసు నిండా సాధారణ చల్లని నీటిని తీసుకోండి. అందులో ఒక చెంచా టీ పొడిని వేసి, కలపకుండా అలాగే ఉంచండి. ఒకవేళ టీ పొడి నీటిలో పడగానే వెంటనే ముదురు గోధుమ లేదా ఎరుపు రంగులోకి మారడం ప్రారంభిస్తే, అందులో కృత్రిమ రంగులు కలిపారని అర్థం. అసలైన టీ పొడి చల్లని నీటిలో వెంటనే రంగును విడుదల చేయదు, కేవలం వేడి నీటిలోనే రంగు మారుతుంది.
ఫిల్టర్ పేపర్ లేదా టిష్యూ పేపర్ పరీక్ష:ఇందుకోసం ఒక శుభ్రమైన వైట్ ఫిల్టర్ పేపర్ లేదా టిష్యూ పేపర్ను తీసుకోండి. దానిపై కొద్దిగా టీ పొడిని వేసి, కొన్ని చుక్కల నీళ్లు చల్లండి. కాసేపటి తర్వాత ఆ పేపర్ను నీటితో కడిగి, ఎండలో పెట్టి చూడండి. పేపర్పై ఎరుపు
లేదా గోధుమ రంగు మరకలు స్పష్టంగా కనిపిస్తే ఆ టీ పొడి కల్తీ అయినట్లే.
టీ పొడిలో బరువు పెంచడానికి ఇనుప రజను కలుపుతుంటారు. దీనిని గుర్తించడానికి టీ పొడిని ఒక ప్లేటులో చల్లి, దానిపై ఒక అయస్కాంతాన్ని తిప్పండి. ఒకవేళ ఇనుప కణాలు అయస్కాంతానికి అంటుకుంటే ఆ టీ పొడిని అస్సలు వాడకండి.
కల్తీ పదార్థాలు మన శరీరంలోకి నెమ్మదిగా చేరే స్లో పాయిజన్ లాంటివి. కాబట్టి, మార్కెట్ నుండి టీ పొడి కొనేటప్పుడు కేవలం బ్రాండ్, తక్కువ ధరను మాత్రమే కాకుండా, ఈ చిన్న పరీక్షలను నిర్వహించి నాణ్యతను నిర్ధారించుకోండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..