
భారతదేశంలో పండుగలంటే స్వీట్లు తప్పనిసరి. అందులోనూ దీపావళి వంటి కొన్ని ప్రత్యేకమైన పండగలప్పుడు వీటి అమ్మకాలు జోరందుకుంటాయి. షాపుల్లో అమ్మే కొన్ని రకాల స్వీట్లు, డ్రై ఫ్రూట్స్ పైన మెరిసే వెండి రంగు పూత ఉండటం చూసే ఉంటారు. ఈ సన్నని రేకులను ‘చాందీ కా వర్క్’ అని కూడా పిలుస్తారు. ఈ రేకులకు ప్రత్యేక రుచి, వాసన లేకున్నా, ఆహారం రుచిని ఏ మాత్రం మార్చకుండా, ఆకర్షణీయమైన లగ్జరీ లుక్ను తీసుకొస్తాయి.
చాలామంది ఈ వెండి రేకును శాకాహారం (Veg) కాదని భావించేవారు. ఈ అనుమానానికి బలమైన కారణం ఉంది. సంప్రదాయబద్ధంగా ఈ వెండి రేకులను తయారు చేయాలంటే, స్వచ్ఛమైన వెండిని తీసుకుని, పల్చని షీట్లుగా మార్చడానికి, వాటి మధ్యలో ఆవు చర్మం లేదా ఎద్దు పేగుల వంటి జంతువుల కణజాలాలను ఉపయోగించేవారు.
ఈ జంతు ఉత్పత్తుల వాడకం కారణంగా, స్వీట్లపై పూసే ఈ వెండి రేకు శాకాహారం కాదని నిర్ధారణ అయ్యేది. దీని వలన, ముఖ్యంగా నైతిక, మతపరమైన ఆందోళనలు పెరిగాయి. పవిత్రమైన ఆలయాలలో నైవేద్యాల కోసం ఈ పూత గల స్వీట్లను వాడేవారు కాదు.
ఈ ఆందోళనలను గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) 2016 ఆగస్టులో ఒక ముఖ్యమైన చర్య తీసుకుంది. సిల్వర్ వర్క్ తయారీలో జంతు సంబంధిత పదార్థాలను వాడకుండా పూర్తిగా నిషేధించింది.
FSSAI కొత్త నిబంధనల ప్రకారం, ఇప్పుడు వెండి రేకును శాకాహారులకు అనుకూలమైన పదార్థాలతో మాత్రమే తయారు చేయాలి. ఈ రేకులను వేరు చేయడానికి ఫుడ్-గ్రేడ్ పేపర్ లేక సింథటిక్ షీట్లు లాంటివి వాడుతున్నారు. జంతు ఉత్పత్తులతో ఎలాంటి సంబంధం లేకుండా చూసుకుంటున్నారు.
ఈ చర్యల వలన భారతీయ స్వీట్లపై వినియోగదారుల నమ్మకం పెరిగింది. ఇప్పుడు మార్కెట్లో దొరికే సిల్వర్ వర్క్ పూర్తిగా స్వచ్ఛమైంది, ఆధునిక శాఖాహార పద్ధతుల్లో తయారు చేయబడింది. కాబట్టి, ఎటువంటి సందేహం లేకుండా కాజు కత్లి లాంటి వెండి పూత స్వీట్లను ఆస్వాదించవచ్చు.