
ఈ రోజుల్లో పిల్లల చేతుల్లో స్మార్ట్ఫోన్లు సర్వసాధారణమైపోయాయి. కానీ, చిన్న వయసులో ఎక్కువ సేపు స్క్రీన్ చూడటం వారి మెదడు అభివృద్ధికి హాని కలిగించవచ్చని ఒక కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది. 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్న పిల్లల్లో స్క్రీన్ టైమ్ ఫోన్లు, టీవీలు, ట్యాబ్లు వంటివి చూడటం వల్ల తీవ్రమైన శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని నూతన పరిశోధనలు, పిల్లల వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మాటలు రావడం ఆలస్యం కావడం :
చిన్నతనంలో పిల్లలు చుట్టూ ఉన్న వ్యక్తుల మాటలు, హావభావాలు చూసి మాట్లాడటం నేర్చుకుంటారు. కానీ, నిరంతరం స్మార్ట్ఫోన్ డిస్ప్లే వైపే చూస్తుండటం వల్ల ఏకపక్ష సమాచారం మాత్రమే జరిగి, పిల్లల్లో సకాలంలో మాటలు రాకపోవడం, భాషా నైపుణ్యాలు లోపించడం జరుగుతోంది.
మానసిక వికాసం, శ్రద్ధ లోపించడం:
అధికంగా స్క్రీన్లు చూడటం వల్ల పిల్లల మెదడు వికాసం మందగిస్తుంది. వారు ఏ విషయంపైనా ఎక్కువ సేపు దృష్టి కేంద్రీకరించలేరు. అలాగే ఫోన్ లాక్కుంటే విపరీతమైన కోపం, చిరాకు, ఏడుపు, మొండితనం ప్రదర్శిస్తారు.
కంటి సమస్యలు, నిద్రలేమి:
ఫోన్ల నుండి వెలువడే నీలి కాంతి పిల్లల కంటి చూపుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చిన్న వయస్సులోనే సైట్ రావడం, కళ్లు పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా, నిద్రకు సహాయపడే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గి నిద్రలేమి సమస్య తలెత్తుతుంది.
ఊబకాయం, శారీరక చురుకుదనం తగ్గడం:
బయటకు వెళ్లకుండా ఒకే చోట కూర్చుని ఫోన్ చూడటం వల్ల చిన్న వయస్సులోనే పిల్లల్లో బరువు పెరగడం, శారీరక బలహీనత వంటి సమస్యలు కనిపిస్తున్నాయి.
తల్లిదండ్రులు పాటించాల్సిన నిపుణుల సూచనలు:
2 ఏళ్ల లోపు పిల్లలకు: డిజిటల్ స్క్రీన్లను అంటే టీవీ, ఫోన్, ట్యాబ్ వంటి అసలు చూపించకూడదు.
2 నుండి 6 ఏళ్ల పిల్లలకు: రోజుకు గంట కంటే ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉండకూడదు.
ఆటలు, సంభాషణ: పిల్లలతో ప్రతిరోజూ సమయం గడపాలి. బొమ్మలతో ఆడించడం, కథలు చెప్పడం, తోటి పిల్లలతో శారీరక ఆటలు ఆడించడం అలవాటు చేయాలి.
పిల్లల ఎదుగుదలలో తొలినాళ్లు చాలా కీలకమైనవి. స్మార్ట్ఫోన్లను తాత్కాలికంగా పిల్లలను శాంతపరచే సాధనంగా వాడకుండా, వారి ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు స్క్రీన్ టైమ్కు ఖచ్చితమైన పరిమితులు విధించడం ఎంతో అవసరం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..