
నేటి వేగవంతమైన జీవనశైలిలో మిగిలిపోయిన ఆహారాన్ని వేడి చేయడానికి లేదా త్వరగా వంట చేయడానికి మైక్రోవేవ్ ఓవెన్ అత్యంత సులభమైన సాధనం. అయితే, మైక్రోవేవ్ వాడకంపై ప్రజల్లో అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. రేడియేషన్ వల్ల క్యాన్సర్ వస్తుందని, ఆహారంలోని పోషకాలు పూర్తిగా నశిస్తాయని కొందరు భావిస్తుంటారు. శాస్త్రీయ దృక్కోణంలో ఈ విషయాలలో ఎంతవరకు నిజముందో తెలుసుకుందాం.
మైక్రోవేవ్ ఓవెన్ నాన్-ఐయోనైజింగ్ రేడియేషన్ రకానికి చెందిన సురక్షితమైన రేడియో తరంగాలను ఉపయోగిస్తుంది. ఇవి ఆహారంలో ఉండే నీరు, కొవ్వు, చక్కెర అణువులను వేగంగా కంపించేలా చేస్తాయి. ఈ ఘర్షణ వల్ల వేడి ఉత్పన్నమై ఆహారం త్వరగా వేడెక్కుతుంది. ఇది రేడియోధార్మికత కాదు, కేవలం వేడిని ఉత్పత్తి చేసే ప్రక్రియ మాత్రమే.
ఏ రకమైన వంట పద్ధతి అయినా, అది పొయ్యి మీద కావచ్చు లేదా మైక్రోవేవ్లో కావచ్చు, ఆహారాన్ని వేడి చేసినప్పుడు విటమిన్ సి, బి-విటమిన్లు వంటి వేడికి సున్నితంగా ఉండే పోషకాలు కొంతవరకు తగ్గుతాయి. అయితే శాస్త్రీయ పరిశోధనల ప్రకారం మైక్రోవేవ్లో ఆహారం తక్కువ సమయంలో వేడెక్కుతుంది. బాణలిలో లేదా పాత్రలలో వండినట్లుగా ఎక్కువ నీరు వాడాల్సిన అవసరం ఉండదు. ఈ రెండు కారణాల వల్ల, ఇతర సాంప్రదాయ వంట పద్ధతులతో పోలిస్తే మైక్రోవేవ్లోనే పోషకాలు ముఖ్యంగా నీటిలో కరిగే విటమిన్లు ఎక్కువగా పదిలంగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), హార్వర్డ్ హెల్త్ తెలిపాయి.
మైక్రోవేవ్లో ఆహారాన్ని వేడి చేసేటప్పుడు ఎప్పుడూ మాక్రోవేవ్-సేఫ్ గాజు లేదా సిరామిక్ పాత్రలనే వాడాలి. సాధారణ ప్లాస్టిక్ డబ్బాలలో వేడి చేస్తే, ప్లాస్టిక్లోని ప్రమాదకర రసాయనాలు ఆహారంలో కలిసే ప్రమాదం ఉంది. ఆహారం కొన్ని చోట్ల చల్లగా, కొన్ని చోట్ల వేడిగా ఉంటే బ్యాక్టీరియా చనిపోదు. కాబట్టి, మధ్యలో ఒకసారి ఆహారాన్ని కలపడం మంచిది. సరైన జాగ్రత్తలు పాటిస్తూ మైక్రోవేవ్ను ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు ఉండదు, పైగా సమయం ఆదా అవ్వడంతో పాటు పోషకాలు కూడా నిలిచి ఉంటాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..