ఉప్పు vs చక్కెర.. పెరుగులో ఏది వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది? అందరూ చేసే తప్పులివే..
భోజనం చివర్లో కాస్త పెరుగు వేసుకోనిదే చాలామందికి తృప్తి ఉండదు. అయితే పెరుగు తినేటప్పుడు కొందరు అందులో ఉప్పు చల్లుకుంటే.. మరికొందరు చక్కెర కలుపుకుని తింటుంటారు. అయితే నిత్యం మనం తినే పెరుగులో ఉప్పు వేసుకోవడం ఆరోగ్యానికి మంచిదా? లేక చక్కెర కలపడం మేలా? ఏది తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం..

మన భారతీయుల ఆహార అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. మధ్యాహ్నం భోజనం ముగింపులో పెరుగు లేదా మజ్జిగ లేకపోతే ముద్ద దిగదు. అయితే పెరుగు తినేటప్పుడు కొందరు అందులో ఉప్పు చల్లుకుని తింటే, మరికొందరు పంచదార లేదా బెల్లం కలుపుకుని తినడానికి ఇష్టపడతారు. అయితే ఆరోగ్య పరంగా పెరుగులో ఉప్పు వేసుకోవడం మంచిదా? లేక పంచదార కలపడం మేలా? అనే డౌట్లు చాలా మందికి ఉంటాయి.
పెరుగులో చక్కెర కలిపి తింటే ఏమవుతుంది?
మన శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో పెరుగు-పంచదార కలయిక అద్భుతంగా పనిచేస్తుంది. పెరుగులోని ల్యాక్టిక్ యాసిడ్, పంచదారలోని గ్లూకోజ్ కలవడం వల్ల శరీరానికి వెంటనే శక్తి లభిస్తుంది. అలాగే మెదడును ప్రశాంతంగా ఉంచడానికి, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఇది తోడ్పడుతుంది. పంచదార కలిపిన పెరుగు కడుపులో మంట, పిత్త సమస్యలు, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారు, బరువు తగ్గాలనుకునే వారు పెరుగులో పంచదార వేసుకుని తినడం అస్సలు మంచిది కాదు. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ను వేగంగా పెంచుతుంది.
పెరుగులో ఉప్పు కలిపి తింటే ఏమవుతుంది?
ఉప్పు కలిపిన పెరుగు లేదా మజ్జిగ వేసవిలో శరీరానికి ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. పెరుగులో కాస్త ఉప్పు, జీలకర్ర పొడి కలిపి తీసుకుంటే జీర్ణక్రియ వేగవంతమవుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలు తొలగిపోతాయి. ఎండ తీవ్రత వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్లు తగ్గినప్పుడు ఉప్పు కలిపిన పెరుగు లేదా మజ్జిగ తాగడం వల్ల వెంటనే రీహైడ్రేషన్ లభిస్తుంది. అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు పెరుగులో తెల్ల ఉప్పు ఎక్కువగా వేసుకుని తినడం వల్ల బిపి పెరిగే ప్రమాదం ఉంది.
ఆయుర్వేదం ప్రకారం ఏది ఉత్తమం?
ఆయుర్వేదం ప్రకారం.. పెరుగు స్వభావరీత్యా వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. పెరుగులో సాధా ఉప్పు కలపడం వల్ల అది నత్రజని సమ్మేళనాలను ప్రభావితం చేసి కొన్ని రకాల ఉదర సమస్యలకు దారితీస్తుందని కొన్ని కథనాలు చెబుతున్నాయి. అందుకే ఆయుర్వేద నిపుణులు పెరుగును నేరుగా లేదా కాస్త నల్ల ఉప్పు, జీలకర్ర పొడి, లేదా తీపి కోసం బెల్లం, తేనె కలిపి తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఆరోగ్యానికి ఏది బెస్ట్?
సాధారణ రోజుల్లో: పసి పిల్లలకు, శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారికి పెరుగు-పంచదార మేలు చేస్తుంది.
జీర్ణ సమస్యలు ఉన్నప్పుడు: గ్యాస్, ఎసిడిటీ ఉన్నవారు పెరుగు లేదా మజ్జిగలో నల్ల ఉప్పు వేసుకుని తాగడం మంచిది.
అత్యంత ఆరోగ్యకరమైన పద్ధతి: పెరుగును ఎలాంటి ఉప్పు, పంచదార కలపకుండా ప్లెయిన్గా తినడం లేదా చక్కెర బదులు బెల్లం, తేనె, తెల్ల ఉప్పు బదులు నల్ల ఉప్పు వాడటం ఆరోగ్యానికి అత్యంత క్షేమదాయకం.
