
భానుడి భగభగలకు వేసవిలో రోజూ రెండు సార్లు స్నానం చేయనిదే అస్సలు ఊరట లభించదు. అయితే ఈ ఎండల వేడి తట్టుకోలేక చాలా మంది చేసే ఒక అలవాటు ఇప్పుడు వైద్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. స్నానం చేయడానికంటే ముందే గదిలో ఏసీ ఆన్ చేసి ఉంచడం.. లేదా స్నానం ముగించుకుని రాగానే తడి ఆరకముందే ఏసీ ముందు కూర్చోవడం ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్గా మారింది. మరి ఇలా చేయడం వల్ల మన శరీరానికి ఎంతటి ముప్పు పొంచి ఉందో.. దీని వెనుక ఉన్న షాకింగ్ హెల్త్ ఫ్యాక్ట్స్ ఏంటో చాలా మందికి తెలియదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వేసవిలో మన శరీర ఉష్ణోగ్రత సాధారణంగానే కాస్త ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో మనం చల్లటి నీటితో స్నానం చేయగానే బాడీ టెంపరేచర్ అకస్మాత్తుగా పడిపోతుంది. ఇలాంటి స్థితిలో.. శరీరం ఆ మార్పుకు అలవాటు పడకముందే, మళ్లీ వెంటనే తీవ్రమైన చలి ఉండే ఏసీ గదిలోకి ప్రవేశించడం వల్ల థర్మో-రెగ్యులేషన్ దెబ్బతింటుంది. ఇది నేరుగా రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపుతుంది. అందుకే మరీ చల్లటి లేదా మరీ వేడి నీటిలో స్నానం చేయకూడదని వైద్యులు చెబుతుంటారు.
మీకు ఆల్రెడీ జలుబు, దగ్గు, ఆస్తమా లేదా సైనస్ వంటి అలర్జీ సమస్యలు ఉంటే.. స్నానం చేసిన వెంటనే ఏసీలో కూర్చోవడం అస్సలు మంచిది కాదు. తడి జుట్టు, తడి శరీరంతో ఏసీ గాలి తగలడం వల్ల జలుబు లేదా దగ్గు మరింత తీవ్రం కావడమే కాకుండా ఊపిరితిత్తులపై ఒత్తిడి పడి శ్వాస తీసుకోవడంలో కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తవచ్చు.
ఏసీ గదిలో ఎక్కువసేపు ఉండటం వల్ల గదిలోని గాలి పొడిగా మారుతుంది. స్నానం చేసిన వెంటనే ఆ పొడి గాలికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కళ్లలో దురద, మంట లేదా నొప్పి కలగవచ్చు. అంతేకాకుండా ఎగ్జిమా, రోసేసియా వంటి చర్మ సమస్యలు ఉన్నవారికి చర్మం పొడిబారిపోయి ఇన్ఫెక్షన్లు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.
మనం స్నానం చేసే సమయానికే ఎండల వల్ల మన శరీరం కొంతవరకు డీహైడ్రేషన్కు గురై ఉంటుంది. వెంటనే ఏసీ గదిలోకి ప్రవేశించడం వల్ల ఆ పొడి గాలి చర్మంలోని తేమను లాగేసి నిర్జలీకరణాన్ని మరింత పెంచుతుంది. దీనివల్ల చాలా మందికి అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి రావడం, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కాసేపు ఆగండి: స్నానం చేసిన వెంటనే ఏసీ గదిలో కూర్చోవద్దు. కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు ఫ్యాన్ గాలిలో ఉండి, మీ శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వచ్చాకే ఏసీ ఆన్ చేయండి లేదా ఆ గదిలోకి వెళ్లండి.
తడి ఆరనివ్వండి: ఒంటిపై, జుట్టుపై తడి పూర్తిగా ఆరిపోయిన తర్వాతే చల్లటి వాతావరణంలోకి వెళ్లడం సురక్షితం.
నీళ్లు తాగొద్దు: స్నానం చేసిన వెంటనే అమితమైన దాహంగా అనిపించినా, వెంటనే చల్లటి నీళ్లు తాగడం మానుకోండి. కొద్దిసేపు రిలాక్స్ అయ్యాక సాధారణ ఉష్ణోగ్రత ఉన్న నీటిని తాగండి.