
సమ్మర్ సీజన్లో సూర్య తాపం నుంచి ఉపశమనం పొందడానికి కొందరు చల్లని పానియాలు సేవిస్తుంటారు. మరికొందరు ఒంటికి చలువ చేసే పుచ్చకాయలు, వేసవిలో శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవడానికి కొబ్బరి నీళ్లు, పళ్ల రసాలు వంటివి తాగుతుంటారు. హైడ్రేటింగ్ గుణాలు ఉన్న పండ్లు తినడం, పానియాలు త్రాగడం మంచిది. వీటిల్లో కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి నీళ్లు త్రాగితే శరీరం రోజంతా హైడ్రేటెడ్గా ఉంటుంది. కొబ్బరి నీళ్లలో కాల్షియం, మాంగనీస్ వంటి అనేక ఇతర పోషకాలు ఉంటాయి. వేసవిలో దీన్ని తాగడం వల్ల శరీరం చాలా కాలం పాటు హైడ్రేట్ గా ఉంటుంది. తక్షణ శక్తి కోసం ఎన్ని పానీయాలు తాగినా, కొబ్బరి నీళ్లలాగా రిఫ్రెష్, శక్తినిచ్చే పానీయం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ఇది ఎలక్ట్రోలైట్స్కు మంచి మూలం. అయితే, చాలా మంది కొబ్బరి నీళ్లు తాగేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. ముఖ్యంగా కొబ్బరి నీళ్లు తాగడానికి సరైన సమయం ఏమిటో చాలామందికి తెలియదు. వేసవిలో కొబ్బరి నీళ్లు ఎప్పుడు, ఏ సమయంలో తాగాలి అనే విషయాలు నిపుణుల మాటల్లో మీకోసం..
కొబ్బరి నీళ్లలో పొటాషియంతోపాటు విటమిన్ సి, జింక్, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. దీని అతి పెద్ద స్పెషాలిటీ ఏమిటంటే దీన్ని తాగడం వల్ల శరీరంలో నీటి లోపం ఉత్పన్నం కాదు. శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ సరిగ్గా ఉంటుంది. వేసవిలో డీహైడ్రేషన్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి కొబ్బరినీళ్లు, దోసకాయ వంటి వాటిని తీసుకోవడం మంచిది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొబ్బరి నీరు శరీరానికి ఎలక్ట్రోలైట్లను వెంటనే అందించడానికి పని చేస్తుంది. అలాగే రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
కొబ్బరినీళ్లు ఏ సమయంలో తాగాలి.. కొంతమంది దీనిని ఖాళీ కడుపుతో, మరికొందరు మధ్యాహ్నం తాగడం ప్రయోజనకరంగా భావిస్తారు. జైపూర్కు చెందిన డైటీషియన్ సుర్భి పరీక్ ఏం చెబుతున్నారంటే.. కొబ్బరి నీళ్లు ఉదయం వేళలో తాగితే మరింత ప్రయోజనకరం అంటున్నారు. భారీగా భోజనంతో లేదా భోజనం తర్వాత త్రాగకూడదు. యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట సమస్య ఉన్నవారు ఖాళీ కడుపుతో కొబ్బరి నీటిని తాగాలి. ఖాళీ కడుపుతో ఈ హెల్తీ డ్రింక్ తాగడం వల్ల అనేక ఇతర ప్రయోజనాలు పొందవచ్చు.
ఉదయాన్నే తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది, దీని ప్రయోజనం బరువు తగ్గడం. కడుపు ఆరోగ్యంగా ఉంటే శరీరం అనేక వ్యాధులు లేదా ఆరోగ్య సమస్యల నుండి రక్షించబడుతుంది. కావాలంటే నిపుణుల సలహా మేరకు మధ్యాహ్నం కూడా తాగవచ్చు. అయితే సాయంత్రం పూట తాగాలా వద్దా అనే విషయంపై నిత్యం గందరగోళం నెలకొంది.
కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు కొబ్బరినీళ్లు తాగకూడదు. ఇది అధిక మొత్తంలో పొటాషియంను కలిగి ఉంటుంది. కొబ్బరి నీళ్లలోని పొటాషియం మూత్రపిండాలలో చేరడం ప్రారంభిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం మరింత పెరుగుతుంది.
కొబ్బరి నీళ్ల వల్ల రెట్టింపు ప్రయోజనాలను పొందడానికి, ఇందులో చియా గింజలను రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇది ఆరోగ్యకరమైన అల్పాహారం. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.