
ప్రతి ఒక్కరికి నిద్ర చాలా ముఖ్యమైనది. రాత్రిపూట తగినంత నిద్ర ఉంటేనే మంచి శక్తితో చురుకుగా ఉంటారు. కానీ, కొంతమంది ఎంత పని చేసినప్పటికీ, ఎంతగా అలసిపోయినప్పటికీ రాత్రుళ్లు సరిగా నిద్రపట్టక అవస్థలు పడుతుంటారు. అలాంటి వారు ఎంత ప్రయత్నం చేసినా నిద్ర పట్టదు. ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఈ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే, నిద్ర విషయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే మనకు నిద్రలేమి సమస్యకు కారణం అంటున్నారు. ప్రశాంతమైన నిద్ర కోసం కొన్ని టిప్స్ పాటించాలని సూచిస్తున్నారు.
ప్రశాంతంగా నిద్రపట్టాలంటే.. ముఖ్యంగా రాత్రి సమయంలో అతిగా భోజనం చేయవద్దని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట సులువుగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. నిద్రకు రెండు గంటల ముందే రాత్రి భోజనాన్ని ముగించాలని, ఇలా చేయటం వల్ల మీ నిద్రకు ఎలాంటి ఆటంకం ఉండదని చెబుతున్నారు. అలాగే, టీవీ, ఫోన్, ల్యాప్ టాప్ వంటి వాటితో రాత్రి వేళ ఎక్కువ సమయం గడపవద్దు అంటున్నారు. దీంతో ఫోన్ నుంచి విడుదలయ్యే నీలి రంగు కాంతి నిద్రకు ఆటంకం కలిగిస్తుందని అంటున్నారు.
ఇకపోతే, నిద్రపోయే ముందు గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. పాలలో ఉండే ట్రిప్టోపాన్ అనే అమినో యాసిడ్ శరీరంలో నిద్రకు అవసరమైన మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల చక్కగా నిద్రపడుతుంది. అంతేగానీ, రాత్రి సమయంలో టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, కేక్స్ తీసుకోకూడదని అంటున్నారు. వీటిలో ఉండే షుగర్, కెఫిన్లు నిద్రకు ఆటంకం కలిగిస్తాయని చెబుతున్నారు.
మరీ ముఖ్యంగా రోజువారీ వ్యాయామం ద్వారా కూడా నిద్రలేమి లక్షణాలను నియంత్రించవచ్చు అంటున్నారు నిపుణులు.. రోజూ తగినంత వ్యాయామం చేయటం వల్ల శరీరంగా అలసట, మనసుకు ప్రశాంతత కలుగుతాయి. ఒత్తిడి తగ్గి గాఢ నిద్రకు దోహదం చేస్తుంది. అంతేకాదు.. ఆరోగ్యవంతమైన శరీరాన్ని పొందడానికి కూడా వ్యాయామం తప్పనిసరి. ఇకపోతే, నిద్రపోయే ప్రదేశం ప్రశాంతంగా, ఎలాంటి శబ్దాలు లేకుండా చీకటిగా ఉండేలా చూసుకోండి.
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..