
పిల్లల సమగ్ర వికాసానికి సమతులాహారం ఎంతో అవసరం. అందుకే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల ఆహారంలో డ్రై ఫ్రూట్స్ను చేర్చుతుంటారు. అయితే బాదం, వాల్నట్స్, పిస్తాపప్పులలో ఏది పిల్లలకి ఎక్కువ మేలు చేస్తుందనే సందేహం చాలామందిలో ఉంటుంది. ప్రముఖ పిడియాట్రీషియన్ డాక్టర్ పార్థ్ సోని పిల్లల ఆరోగ్యానికి ఈ మూడు డ్రై ఫ్రూట్స్ ఎలాంటి ప్రయోజనాలను అందిస్తాయో వివరించారు.
పిల్లల మెదడు వికాసానికి వాల్నట్స్ అత్యుత్తమ ఎంపిక అని వైద్యులు చెబుతున్నారు. వీటిలో ప్లాంట్-బేస్డ్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. బాదం, పిస్తాతో పోలిస్తే వాల్నట్స్లో ఒమేగా-3 పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల, ఇది పిల్లల జ్ఞాపకశక్తిని, బ్రెయిన్ పవర్ను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
పిల్లల ఎముకలను దృఢంగా మార్చడానికి, శారీరక ఎదుగుదలను ప్రోత్సహించడానికి బాదం చాలా ఉపయోగపడుతుంది. గుప్పెడు బాదంలో దాదాపు 6 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. వీటిలోని కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ E వంటి పోషకాలు కండరాల నిర్మాణానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి దోహదపడతాయి.
పిస్తా పప్పుల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది పిల్లల జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో తోడ్పడుతుంది. అంతేకాక, వీటిలో ఉండే ల్యూటిన్, జియాజాంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు పిల్లల కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు డ్రై ఫ్రూట్స్ను నేరుగా అందించకూడదు. చిన్న పిల్లలలో డ్రై ఫ్రూట్స్ గొంతులో అడ్డుపడే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వీటిని మెత్తని పొడిగా చేసి పాలలో, లేదా జావ, ప్యూరీలలో కలిపి అందించడం సురక్షితమైన మార్గమని వైద్యులు సూచిస్తున్నారు. మొత్తానికి, మెదడు అభివృద్ధికి వాల్నట్స్, శారీరక ఎదుగుదలకు బాదం, జీర్ణక్రియకు పిస్తా.. ఇలా మూడింటిని తగిన పరిమాణంలో అందించడం వల్ల పిల్లలకు సంపూర్ణ పోషణ లభిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..