తెలుగురాష్ట్రాల ప్రజలకు వాతావరణ సూచన. ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని కారణంగా రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ సూచనలు చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం శ్రీలంక తీరానికి సమీపంలో 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉందని, ఇది తమిళనాడు వరకూ విస్తరించి, భారీ ఆవర్తనంగా మారిందని పేర్కొంది. దీని ప్రభావం వల్ల 8వ తేదీ వరకు తెలంగాణ, ఆంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆవర్తనం కారణంగా నిన్నటినుంచి తమిళనాడులో కుండపోత వర్షం కురుస్తుండగా, అటు, ప్రకాశం, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల తెల్లవారుజాము వరకూ భారీ వర్షాలు పడ్డాయి.