బరాత్ లో రానివ్వలేదని చెయ్యి కోసుకున్న మేనమామ..!
మీర్జాపూర్ జిల్లాలో మేనల్లుని వివాహ ఊరేగింపులో లాక్డౌన్ నిబంధనల పేరుతో తనను రానివ్వనందున కలత చెందిన మామ తన చెయ్యి కత్తితో కోసుకున్నాడు.
యూపీలో జరిగిన పెళ్లి తంతులో ఓ యువకుడు చెయ్యి కోసుకున్నాడు. మీర్జాపూర్ జిల్లాలో మేనల్లుని వివాహ ఊరేగింపులో లాక్డౌన్ నిబంధనల పేరుతో తనను రానివ్వనందున కలత చెందిన మామ తన చెయ్యి కత్తితో కోసుకున్నాడు. ఒకవైపు మేనల్లుడి వివాహ ఊరేగింపునకు సన్నాహాలు జరుగుతుండగా, మరోవైపు మామ గాయంతో విలవిలలాడాడు. దీంతో మేనల్లుడు పెళ్లి ఊరేగింపునకు నిరాకరించారు. అయితే మిగిలిన పెళ్లివారు నచ్చజెప్పడంతో ఊరేగింపు సాగింది. ఈ ఘటన మీర్జాపూర్ జిల్లాలోని అహ్రౌరా పోలీస్ స్టేషన్ ప్రాంతం పరిధిలో జరిగింది. అహ్రౌరాడీహ్కు చెందిన వరుడు ఓంప్రకాష్ ఊరేగింపుగా చందౌలి జిల్లాకు బయలుదేరాడు.అయితే లాక్డౌన్ నియమాలు, సామాజిక దూరం పాటించాలంటూ ఊరేగింపులో ఐదుగురు మాత్రమే పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో వరుని మేనమామ తానూ వస్తానంటూ పట్టుబట్టాడు. దీంతో పెళ్లి పెద్దలు ఎంత నచ్చచెప్పినా అతను వినలేదు. పైగా వారంతా తనను దూరంపెడుతున్నారని భావించి, తీవ్ర మనస్తాపంతో కత్తితో చెయ్యి కోసుకున్నాడు. దీంతో తీవ్రంగా రక్తస్రావం కావడంతో అక్కడున్నవారంతా వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు. దీంతో వరుడు బరాత్ నిర్వహించేందుకు నిరాకరించాడు. పెళ్లి పెద్దలు వరునికి నచ్చజెప్పడంతో గొడవ సర్ధుమణిగింది.