ఏపీలో సినిమా షూటింగ్ షూరు.!
సినీ రంగంలో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు, రాష్ట్రంలో సినిమా రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో తెలుగు సినీ ప్రముఖులు సమావేశం.
సినీ రంగంలోని సమస్యల పరిష్కారంతో పాటు, రాష్ట్రంలో సినిమా రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో తెలుగు సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నటులు చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు సురేశ్బాబు, సి.కల్యాణ్, దిల్రాజు తదిరులు సీఎంను కలిసారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యలు, పరిష్కారంపై ఈ సందర్భంగా సీఎంతో చర్చించారు. రాష్ట్రంలో ఉచితంగా సినిమా చిత్రీకరణలకు అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మరో వైపు విశాఖలో సినీ పరిశ్రమ విస్తరణకు అనుమతి ఇవ్వాల్సిందిగా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన సినిమా, సీరియల్స్ షూటింగ్స్ ను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారు. తొలుత మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో 25మంది సినీ ప్రముఖుల బృందం సీఎం జగన్ను కలవాలని అనుకున్నారు. అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏడుగురికి మాత్రమే కలిసే అవకాశం లభించింది.ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన సినీ ప్రముఖులకు ముఖ్యమంత్రి జగన్ సాదరస్వాగతం పలికారు. అనంతరం వారితో సమావేశం అయ్యారు. కరోనా ప్రభావంతో సినీ పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుందని సీఎంకి వివరించారు. దాదాపు మూడు నెలల పాటు సినిమా షూటింగ్లు ఆగిపోయాయి. సినిమా రంగం పూర్వ వైభవం సాధించాలంటే తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వినోదపన్నుకు మినహాయింపు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. విశాఖలో స్టూడియోలు, ల్యాబ్లు నిర్మాణానికి సినీ రంగం సిద్ధంగా ఉందని ఇందుకు తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిందిగా సీఎం జగన్ కోరారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఏడాది కాలంగా కలవాలని అనుకున్నాం కుదరలేదని.. ఈ రోజు సినీ పరిశ్రమ తరుపున కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపామన్నారు . కరోనాతో నిలిచిపోయిన షూటింగ్ లకు అనుమతిచ్చినందుకు జగన్ కి ప్రత్యేక దన్యవాదాలు తెలిపామన్నారు. అలాగే థియేటర్లలో మినిమం ఫిక్స్డ్ ఛార్జ్ లు ఎత్తివేయాలని కోరామన్నారు. మరోవైపు పెండింగ్ లో ఉన్న నంది వేడుకలను నిర్వహించాలని కోరామన్న చిరంజీవి.. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి తాను వెన్నంటి ఉంటానని సీఎం చెప్పడం సంతోషాన్నిచ్చిందన్నారు.