Telangana Health department: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. అయినా, రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీలు), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్సీలు), ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆసుపత్రులు, బస్తీ దవాఖానాలు, బోధనాస్పత్రులు సహా అన్ని రకాల ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆసుపత్రులకు ఐదు కోట్ల డోలో మాత్రలను సరఫరా చేసింది. కరోనా వైరస్ వచ్చిన వారికి జ్వరం ఉంటే తప్పనిసరిగా డోలో లేదా పారాసిటమాల్ వంటి మాత్రలు ఇస్తారు.
కరోనా కట్టడికి వినియోగించే అజిత్రోమైసిన్ వంటి యాంటీబయోటిక్స్, మల్టీవిటమిన్, సీ–విటమిన్, డీ–విటమిన్ మాత్రలు సహా మొత్తం 54 రకాల ఔషధాలను ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేశారు. అలాగే జలుబు, దగ్గు, ఇతరత్రా లక్షణాలున్న వారికి ఉపయోగపడే మందులను కూడా పంపించారు. బీపీ, షుగర్, శ్వాసకోశ సంబంధ వ్యాధులు సహా ఇతర దీర్ఘకాలిక రోగాలకు అవసరమైన మందులను కూడా ప్రభుత్వం సరఫరా చేసింది. వాటితోపాటు అత్యవసర మందులను కూడా పంపారు.
కాగా.. రాష్ట్రంలో ప్రతి నెలా లక్ష మందికి సరిపోయేలా, ఐదు నెలల్లో ఐదు లక్షల మందికి అవసరమైన 54 రకాల మందులను సరఫరా చేశామని తెలంగాణ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ తెలిపింది.
Also Read: కరోనా బాధితుల కోసం.. నిరంతర సేవలో.. 216 అంబులెన్సులు..