దిల్లీ: ఇప్పటివరకు కేవలం పుడ్ ను మాత్రమే సరఫరా చేస్తున్న ‘స్విగ్గీ’.. ఇకపై నిత్యావసర సరకులు కూడా డెలివరీ చేయనుంది. దీనికోసం ‘స్విగ్గీ స్టోర్స్’లను మంగళవారం కంపెనీ ప్రారంభించింది. ఈ స్టోర్ల నుంచి ప్రూట్స్, కిరాణాసామగ్రి, వెజిటేబుల్స్, బేబి కేర్, హెల్త్కేర్కు సంబంధించిన వాటిని ఇంటి వద్దకే సరఫరా చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.
ఈ సరికొత్త సేవలను ప్రయోగాత్మకంగా గుడ్గావ్లో ప్రవేశపెట్టింది. వీటిని మరికొన్ని నెలల్లోనే దేశవ్యాప్తంగా ఉన్న మెట్రోనగరాలకు విస్తరించనుంది. ఈ కొత్త సేవలతో స్విగ్గీ ఇక బిగ్బాస్కెట్, గ్రోఫెర్స్, అమెజాన్ ప్రైమ్నౌ, ఫ్లిప్కార్ట్ సూపర్ మార్ట్లతో పోటీపడనుంది. ఈ సేవలను యాప్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది.
‘‘ఆహారపదార్థాలను డెలివరీ చేయటంలో వినియోగదారులకు మంచి అనుభూతిని పంచిన స్విగ్గీ ఇకపై అటువంటి అనుభూతినే నిత్యావసరాలను సరఫరా చేయటంలో కూడా అందిస్తుందని ఆశిస్తున్నాం’’ అని స్విగ్గీ సీఈఓ శ్రీహర్ష మాజేటీ అన్నారు. పట్టణ వినియోగదారుల జీవన నాణ్యతను పెంచటంలో స్విగ్గీ తొలి మైలురాయిను దాటిందని ఆయన చెప్పారు. 2014లో స్థాపించిన ‘స్విగ్గీ’కి దేశవ్యాప్తంగా 80కి పైబడి పట్టణాల్లో తనకున్న 60,000 రెస్టారెంట్ల భాగస్వాములతో వినియోగదారులకు పుడ్ ను సర్వ్ చేస్తుంది.