
సూర్యాపేట జిల్లాకు చెందిన నాలుగు నెలల బాబు కరోనా వైరస్ సోకి మృతి చెందాడు. సూర్యాపేట సమీపంలోని కాసరబాద గ్రామానికి చెందిన నాలుగు నెలల చిన్నారి ఆనారోగ్యం పాలయ్యాడు. దీంతో బాబు తల్లిదండ్రులు మంగళవారం అతన్ని హైదరాబాద్ లోని నీలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఆ బాబుకి పాజిటివ్ గా తేలింది. బుధవారం చికిత్స అందించే క్రమంలో ఆ చిన్నారి గుండె కి రంధ్రం ఉందని, కరోనా వైరస్ సోకడంతో శ్వాస తీసుకోలేక చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
కాసరబాద గ్రామానికి చెందిన ఆ చిన్నారి తల్లి ప్రసవం కోసం కోసం ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూర్ లోని పుట్టింటికి వెళ్లింది. డెలివరీ అయిన నాలుగు నెలల తర్వాత ఆమె కాసరబాద గ్రామానికి వచ్చింది. అయితే కొద్ది రోజుల క్రితం ఆ పసివాడికి జ్వరం రావడంతో స్థానిక ఆస్పత్రిలో చూపించారు. జ్వరం తగ్గకపోవడంతో ఆ బాబును నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. కరోనా వైరస్ కారణంగా బుధవారం మధ్యాహ్నం ఆ బాలుడు చనిపోయాడు. దీంతో ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. బాబు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు గా విలపిస్తున్నారు.