Sensational theft: పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలో భారీ దోపిడీ చోటుచేసుకుంది. ఐదుగురు సాయుధులు ముసుగులు ధరించి లూధియానాలోని గిల్ రోడ్లో ఉన్న ఫైనాన్స్ కంపెనీ – ఇండియా ఇన్ఫోలైన్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఐఐఎఫ్ఎల్) శాఖ నుండి సుమారు ₹ 12 కోట్ల విలువైన 30 కిలోల బంగారు ఆభరణాలను, 3 లక్షల నగదును దొంగిలించారు. సిబ్బందిని తాళ్లతో కట్టేసిన నిందితులు కేవలం 25 నిమిషాల్లో చోరీ కార్యక్రమం పూర్తీ చేశారు. కాగా, చోరీ సమయంలో నలుగురు ముసుగులు ధరించి కార్యాలయం లోపలికి ప్రవేశించారని, మరొకడు బయట కారులోనే ఉన్నాడని పోలీసులు తెలిపారు.
నిందితులు డిజిటల్ వీడియో రికార్డర్ (డివిఆర్) వెంట తీసుకెళ్లారు. కొంతమంది ఉద్యోగుల అంతర్గత పాత్రను పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఐఐఎఫ్ఎల్ భద్రతా సిబ్బంది అక్కడ లేరని చెప్పారు. దుండగులు అక్కడ్నుంచి పరారైన వెంటనే ఐఐఎఫ్ఎల్ సిబ్బంది అలారం మోగించారని తెలిపారు. ఘటనా స్థలానికి వెళ్లి పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. ఐఐఎఫ్ఎల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, పక్క ప్లాన్ ప్రకారమే దుండుగులు ఈ దోపిడీకి పాల్పడినట్లు తెలుస్తోంది.
పంజాబ్ పోలీసుల క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (సిఐఐ) కార్యాలయానికి ఎదురుగా క్రైమ్ స్పాట్ ఉంది. కాగా, దుండుగులు ముసుగులు వేసుకుని ఐఐఎఫ్ఎల్ కార్యాలయంలోకి చొరబడిన దృశ్యాలు, ఆ తర్వాత దోపిడీ చేసిన బంగారంతో బయటికి వచ్చిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. జన సంచారం స్వల్పంగా ఉన్నప్పటికీ ఎవరికీ అనుమానం రాకుండా దొంగలు వ్యవహరించడం గమనార్హం. కాగా, గత 20 రోజుల్లో ఇది రెండో భారీ దోపిడీ కావడం గమనార్హం. జనవరి 29న నలుగురు దుండుగులు ఆయుధాలతో ఓ నగల దుకాణంలో చొరబడి రూ. 80 లక్షల విలువైన 2 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఇప్పటి వరకు ఆ కేసు తేలకపోవడం గమనార్హం.