జగన్ మొనగాడు… అందుకే ‘అలా’ చేశాడన్న రోజా

వైసీపీ ఎమ్మెల్యే, ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ రోజా సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కామెంట్ చేసిన రోజా.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును...

జగన్ మొనగాడు... అందుకే 'అలా' చేశాడన్న రోజా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 14, 2020 | 2:56 PM

వైసీపీ ఎమ్మెల్యే, ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ రోజా సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కామెంట్ చేసిన రోజా.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. తిరుపతిలో సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన రోజా తనదైన శైలిలో విపక్ష నేతలపై విమర్శలు గుప్పించారు. అదే సమయంలో తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు.

చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లపై ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో సీబీఐని రాష్ట్రంలోకి అనుమతించేది లేదని బీరాలు పలికిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు సిగ్గు లేకుండా సీబీఐ విచారణ కావాలని అడుగుతున్నారని బాబుపై మండి పడ్డారు రోజా. గతంలో అనేక సార్లు దేవాలయాల్లో బూట్లు వేసుకొని మరి పూజలు నిర్వహించిన చంద్రబాబు, ప్రస్తుతం జగన్‌కు ఒక మతాన్ని ఆపాదించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు రోజా. బెజవాడ దుర్గగుడిలోను, శ్రీకాళహస్తిలోను చంద్రబాబు క్షుద్ర పూజలు చేయించారని ఆమె ఆరోపించారు.

గతంలో విజయవాడలో 40 గుళ్ళను కూల్చేసిన చంద్రబాబు, ఇపుడు తాను తెర వెనుక ఉండి బీజేపీ, జనసేన పార్టీ నేతలతో అంతర్వేదిలో ఆందోళనలు చేసేలా కుట్రలు చేస్తున్నారని రోజా ఆరోపించారు. చంద్రబాబు గతంలో దేవాలయాలను కూలుస్తున్నప్పుడు బీజేపీ, జనసేన నేతలు ఎక్కడికి వెళ్లారని ఆమె ప్రశ్నించారు. జగన్ మొనగాడు కాబట్టి అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించారని రోజా కామెంట్ చేశారు. తిరుమల పింక్ డైమండ్ విషయంలో సీబీఐ విచారణ అడుగుతున్న పవన్ కళ్యాణ్.. తాను మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న బీజేపీ నేతలను పింక్ డైమండ్ విషయంలో సిబిఐ విచారణకు ఒప్పించాలని రోజా సూచించారు. అంతర్వేది ఘటన విషయంలో సీబీఐ విచారణకు సిద్ధపడ్డ వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజమైన మొనగాడంటూ రోజా ప్రశంసలు గుప్పించారు