Constitution of India: బ్రిటిష్ వారి నుంచి మన దేశం స్వాతంత్య్రం సంపాదించుకున్న తర్వత ప్రజలకు పాలన, హక్కులు, విధులు, బాధ్యతలను తెలిజేయస్తూ మనం రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న రోజు రిపబ్లిక్ డే. రాజ్యాంగ రచన కోసం డా. బి.ఆర్. అంబేడ్కర్, డా. బాబూ రాజేంద్రప్రసాద్ వంటి ప్రముఖులు ఎంతో కృషి చేశారు. మనం ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం ప్రకారం మనల్ని మనం పరిపాలించుకోవడం ప్రారంభించుకున్న రోజు కనుకే.. దీనికి ఇంత ప్రాముఖ్యత.
భారత ప్రజల అపార త్యాగాల ఫలితంగా దేశానికి రాజకీయ స్వాతంత్య్రం సిద్ధించింది. భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.1949 నవంబరు 26వ తేదీన రాజ్యాంగ నిర్మాణ సభ ఆమోదించి శాసనంగా రూపొందింది. 1950 జనవరి 24న సభ్యులు ఈ ప్రతిపై సంతకాలు పెట్టారు. మొత్తం 284 మంది సభ్యులు సంతకాలు చేసారు. అయితే ఈ రాజ్యాంగం 395 అధికరణలు, 22 భాగాలు, 9 షెడ్యూళ్ళతో రూపొందించారు. మన రాజ్యాంగం జనవరి 26వ తేది ఉదయం 10:18 నిమిషాలకు అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రపంచానికి భారత దేశం నూతన గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడింది.
స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ సభకు పట్టిన కాలం: 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు. రాజ్యాంగ రూపకల్పన చేసే సమయంలో సభ 11 సార్లు, 165 రోజుల పాటు సమావేశమైంది. ఇందులో 114 రోజులు రాజ్యాంగం రాయటానికే పట్టింది. రాజ్యాంగ రాతప్రతిని తయారుచేసే క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు 7,635 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 2,473 ప్రతిపాదనలను పరిశీలించి, చర్చించి, పరిష్కరించింది. 1950 జనవరి 26 తేదీన రాజ్యాంగ సభ రద్దయి, భారత్ తాత్కాలిక పార్లమెంటు గా మారింది. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తరువాత కొత్త పార్లమెంటు ఏర్పడే వరకు ఈ తాత్కాలిక పార్లమెంటులోనే సభలు సమావేశాలు జరిగాయి. మన రాజ్యాంగం యొక్క అసలు ప్రతులు రెండు మాత్రమే ఉన్నాయి, హిందీలో ఒక ప్రతి, ఇంగ్లీష్ లో ఒక ప్రతి ఉన్నాయి, ఆ ప్రతులు పాడవకుండా ఉండేందుకు హీలియం వాయువు నింపిన బ్రీఫ్కేసులలో పార్లమెంట్ భవనంలో భద్రపరిచారు, వాటి నకలును ఫోటో కాపీలు మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి.
భారత రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారం అయినప్పటికీ అనేక అంశాలు ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు. వాటిలో ముఖ్యమైనవి. బ్రిటన్ నుంచి ఏక పౌరసత్వం, పార్లమెంటరీ విధానం, స్పీకర్ పదవిలను ప్రామాణీకంగా తీసుకున్నారు. ఇక అమెరికా నుంచి ప్రాథమిక హక్కులు, సుప్రీం కోర్టు, న్యాయ సమీక్షాధికారాన్ని తీసుకున్నారు. భారతదేశంలో ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతిఎన్నిక, రాజ్యసభ సభ్యుల నియామకాన్ని ఐర్లాండ్ దేశం నుంచి తీసుకున్నారు. ఇక భారతదేశంలో ప్రాథమిక విధులను రష్యా నుంచి, కేంద్ర రాష్ట్ర సంబంధాలను కెనడా నుంచి, అత్యవసర పరిస్థితిని జర్మనీ నుంచి ప్రామాణికంగా తీసుకుని మన రాజ్యాంగాన్ని రూపొందించారు.
ఇలా మనం ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం ప్రకారం మనల్ని మనం పరిపాలించుకోవడం ప్రారంబించుకున్న రోజు కనుకనే రిపబ్లిక్ డే కి అంత ప్రాముఖ్యత. ఈ రోజున సాహస బాలలకు అవార్డులతో సహా దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. భారత రాష్ట్రపతి ప్రసంగిస్తారు. దేశ ప్రజలందరూ అట్టహాసంగా ఈ వేడుకల్ని జరుపుకుంటారు.
Also Read: ఆ గ్రామంలో పాము కరిచినా ఏమీకాదు.. పొలిమేర దాటితే మరణం.. సైన్స్ కు అందని మిస్టరీ నాగేన హళ్లి