పాకిస్థాన్ నుంచి భారతదేశంలోకి వేగంగా దండ యాత్ర చేస్తున్నాయి మాయదారి మిడతలు. రాజస్థాన్లో మిడతల దాడితో రైతుల లబొదిబోమంటున్నారు. దాదాపు 20 జిల్లాల్లో ఈ నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90 వేల హెక్టార్లలో పంట నష్టపోయినట్లు భావిస్తున్నారు. ఈ సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుందంటున్నారు అధికారులు. శ్రీగంగానగర్, నాగౌర్, జైపూర్, దౌసా, కరౌలీ, స్వాయి మాదోపూర్ నుంచి మిడతల దండు.. యూపీ, మధ్యప్రదేశ్ వైపు వెళ్లాయి. శ్రీగంగాపూర్లో సుమారు 4వేల హెక్టార్లలో పంట నష్టపోయింది. నాగౌర్లోనూ వంద హెక్టార్లలో పంట నష్టపోయినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 67 వేల హెక్టార్లలో మిడతల నివారణ చర్యలు చేపట్టినట్లు ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ ఓం ప్రకాశ్ తెలిపారు. మరోవైపు రాజస్థాన్ నుంచి దేశవ్యాప్తంగా విస్తరిస్తుండడంతో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసింది.