Masks Compulsory : కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. నియంత్రనకు మాస్క్ ధరించడం మార్గం. ఈ దృష్ట్యా పలు రాష్ట్రాలు ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
వ్యాక్సిన్ వచ్చేంత వరకూ మాస్క్నే వ్యాక్సిన్గా పరిగణించాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రజలకు సూచించింది. ఇదే వరుసలో తాజాగా రాజస్తాన్ మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో మాస్కులు ధరించడం తప్పనిసరిచేస్తూ చట్టం తీసుకొస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా కరోనా ప్రభావం దృష్ట్యా రాష్ట్రంలో బాణాసంచాను కూడా నిషేధిస్తున్నట్లు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్పై ప్రజలకు అవగాహన కల్పించే భారీ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సమయంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తూ నిర్ణయించాం. ఈరోజు నుంచి ఇది చట్టరూపం దాల్చనుంది’ అని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ట్విటర్లో వెల్లడించారు. అంతేకాకుండా రాజస్థాన్లో బాణాసంచా అమ్మకాలు, కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. కరోనా నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. చాలా దేశాల్లో కరోనా వైరస్ రెండో దఫా విజృంభిస్తోన్న వేళ, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సూచించారు.