కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్త లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ప్రజలంతా ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. మరోపక్క పోలీసులు రాత్రి, పగలూ అనే తేడా లేకుండా శ్రమిస్తున్నారు. ఇటువంటి సమయంలో వృత్తే ప్రధానమని భావించిన ఓ కానిస్టేబుల్ కాలినడకన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నుంచి మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చేరుకున్నాడు. కాన్పూర్లోని భౌటికి చెందిన ఆనంద్ పాండే జబల్పూర్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. తన భార్య అనారోగ్యంగా ఉందని తెలిసి.. ఫిబ్రవరి 20న సెలవుపై ఇంటికి వచ్చాడు. లాక్డౌన్ విధించడం వల్ల అక్కడే చిక్కుకున్నాడు.
కాగా.. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ ఆనంద్ పాండే వృత్తి ధర్మాన్ని మర్చిపోలేదు. మార్చి 30న కాలి నడకన కాన్పూర్ నుంచి బయలుదేరాడు. మార్గం మధ్యలో కొందరు లిఫ్ట్ కూడా ఇచ్చారు. అలా మూడు రోజులకు జబల్పూర్ చేరుకున్నాడు. ఆయనకు వృత్తిపట్ల ఉన్న అంకితభావానికి ఇన్స్పెక్టర్ బాఘెల్, మిగిలిన పోలీసులు ప్రశంసించారు. ఇప్పుడు ఆనంద్ పాండే జబల్పూర్లోని గంటాఘర్ చౌక్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఆనంద్ పాండే మాత్రమే కాదు.. ఇటువంటి పరిస్థితుల్లో ఇటీవల 22 ఏళ్ల కానిస్టేబుల్ దిగ్విజయ్ శర్మ 450 కిలోమీటర్లు నడిచారు. 20 గంటలు నడిచి ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్లోని రాజ్ఘర్ చేరుకుని విధులకు హాజరయ్యారు.