#COVID19 కరోనా కట్టడిలో రైల్వేస్ మరో ముందడుగు… పీపీఈల తయారీ షురూ

| Edited By: Pardhasaradhi Peri

Apr 07, 2020 | 2:18 PM

కరోనా నియంత్రణ చర్యల్లో నిమగ్నమైన రైల్వే శాఖ మరో ముందడుగు వేసింది. గత నెల 15వ తేదీ నుంచి రైల్వే ప్రయాణాలను రద్దు చేసిన అధికారులు.. ఆ తర్వాత రైల్వే కోచ్‌లను ఐసొలేషన్ వార్డులుగా మలిచారు. ఆ తర్వాత మరో కీలక నిర్ణయం తీసుకుంది రైల్వే శాఖ

#COVID19 కరోనా కట్టడిలో రైల్వేస్ మరో ముందడుగు... పీపీఈల తయారీ షురూ
Follow us on

Railways to produce PPEs and got DRDO approval: కరోనా నియంత్రణ చర్యల్లో నిమగ్నమైన రైల్వే శాఖ మరో ముందడుగు వేసింది. గత నెల 15వ తేదీ నుంచి రైల్వే ప్రయాణాలను రద్దు చేసిన అధికారులు.. ఆ తర్వాత రైల్వే కోచ్‌లను ఐసొలేషన్ వార్డులుగా మలిచారు. ఆ తర్వాత మరో కీలక నిర్ణయం తీసుకుంది రైల్వే శాఖ. కరోనా నియంత్రణలో సేవలందిస్తున్న వైద్యవర్గాలకు ఎలాంటి హాని కలగకుండా వుండే ప్రత్యేక డ్రెస్ అవసరమైన నేపథ్యంలో వాటి కొరతను నివారించేందుకు రైల్వే శాఖ ముందుకొచ్చింది.

కరోనా పాజిటివ్‌గా తేలిన రోగులకు సేవలందిస్తున్న వైద్య వర్గాలు తమ ప్రాణాలను తామే ఫణంగా పెడుతున్న వైనం దేశంలో ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది. అయితే.. వైద్య వర్గాలు వేసుకోవాల్సిన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ)ల కొరతతో ప్రతీ ఒక్కరిలో ఆందోళన పెంచింది. కరోనా నియంత్రణకు కృషి చేస్తున్న వైద్యులకే కరోనా వైరస్ సోకితే ఎలా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో పీపీఈల కొరత వుందని సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాన్ఫరెన్సులో తెలిపిన పరిస్థితి. దాంతో పీపీఈల తయారీపై ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు పరిశ్రమలు చర్యలు ప్రారంభించాయి.

ఈ క్రమంలోనే రైల్వే శాఖ ముందుకొచ్చింది. యుద్దప్రాతిపదికన పీపీఈ ఓవరాల్స్ తయారీ చేపట్టింది. రైల్వే శాఖకు చెందిన జగధారి వర్క్‌షాపులో పీపీఈల తయారీకి చర్యలు ప్రారంభించింది. ప్రయోగాత్మకంగా తయారు చేసిన పీపీఈ ఓవరాల్ సూటును డీఆర్డీఓ ఆమోదానికి పంపారు. తాజాగా.. డీఆర్డీఓ రైల్వే శాఖ వర్క్ షాపులో రూపొందించిన పీపీఈ సూటును ఆమోదించింది. డీఆర్డీఓ ల్యాబ్ టెస్టు పాసవడంతో పీపీఈలను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు రైల్వే శాఖాధికారులు చర్యలు ప్రారంభించారు. దేశంలో పీపీఈల కొరత నివారణకు రైల్వే శాఖ తీసుకున్న చర్యలను ప్రతీ ఒక్కరు ప్రశంసిస్తున్నారు.