దిగు దిగు నాగా.. దివ్యాసుందర నాగో.. అంటూ నాగరాజును పూజిస్తూ నాగుల పంచమి రోజున పుట్టలో పాలుపోసే భక్తులు ఎంతో మంది ఉన్నారు. అయితే ఇలాంటి భక్తులకు ఇది చేదువార్తే. ఇకమీదట ఎవరైనా పాములకు పాలుపోస్తే దాన్ని నేరంగా పరిగణించి కఠినంగా శిక్షిస్తామంటున్నారు అధికారులు.
తమ భక్తి కొద్దీ పుట్టలో ఉన్న పాముకు పాలుపోసి మొక్కులు చెల్లించుకోవడం సహజంగా జరుగుతుంది. అయితే ఇలాంటి పనులు చేస్తే ఇకపై జైలు ఖాయమంటున్నారు అధికారులు. పాములకు పాలు పోయడం నేరమని, ఇలా పాలు పోసి వాటికి హాని చేయాలని చూస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అదే విధంగా పాములు పట్టి ఆడించినా, పూజల పేరుతో వేధించినా శిక్షలు మాత్రం తప్పవంటున్నారు.