మందు లేని మహమ్మారి క్యాన్సర్ బాధితులకు ఒక శుభవార్త. వ్యాధి నివారణకు కొత్త మందును అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు అమెరికాకు చెందిన అంకాలజీ వైద్య నిపుణులు ప్రకటించారు.
ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న క్యాన్సర్ వ్యాధి చికిత్సలో కొత్త మందులు సంతృప్తికర ఫలితాలనిస్తున్నాయని ప్రపంచ క్యాన్సర్ వైద్య నిపుణులు వెల్లడించారు. ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, పెద్దపేగు క్యాన్సర్ల నివారణలో ఈ మందులు సమర్థవంతంగా పనిచేస్తున్నాయంటున్నారు. వీటి వాడకం ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్ ప్రభావాలూ తక్కువగా ఉంటున్నాయన్నారు. దీన్ని పొందాలంటే మాత్రం కాస్త ధర ఎక్కువగా వెచ్చించాల్సి ఉంటుందంటున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ అదుపునకు ఆస్ట్రా జెనికా కంపెనీ తయారు చేస్తున్న ‘టాగ్రిస్సో’ బాగా పనిచేస్తోందని.. ఆ ఔషధంపై ట్రయల్స్ జరుగుతున్నాయని యేల్ క్యాన్సర్ సెంటర్ వైద్యులు డాక్టర్ రాయ్ హెర్బ్స్ తెలిపారు. ఈ మందు నెలరోజుల కోర్సుకు 15 వేల డాలర్లు ఖర్చవుతుందన్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ కారణంగా తలెత్తే ఇతర సమస్యలను మ్యోవాంట్ సైన్సెస్ కంపెనీకి చెందిన ‘రెలుగోలిక్స్’ సమర్థంగా అదుపు చేస్తోందని సియాటిల్లోని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ సెలెస్టియా హిగానో తెలిపారు. మెర్క్ అండ్ కంపెనీ వారి ‘కీట్రుడా’ పెద్దపేగు క్యాన్సర్ను అదుపు చేస్తున్నట్లు నాష్విల్లే క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధిపతి డాక్టర్ హోవర్డ్ బరిస్ వెల్లడించారు. ప్రస్తుతం ఈయన యూఎస్లోని అంకాలజీ సొసైటీ అధ్యక్షుడిగానూ సేవలందిస్తున్నారు. అయితే, ఇంతకాలం సరియైన మందులేక ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అమెరికా వైద్యులు చేస్తున్న కొత్త ప్రయోగం వల్ల క్యాన్సర్ బాధితులకు కొంత ఊరట లభించనట్లవుతుంది.