
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం వ్యవస్థ కలిగిన భారతదేశంలో 18వ సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతున్నాయి. 2024 లోక్సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్నాయి. మొదటిది ఏప్రిల్ 19న, రెండవది ఏప్రిల్ 26న, మూడవది మే 7న, నాల్గవది మే 13న, ఐదవది మే 20న, ఆరవది మే 25న, ఏడవది జూన్ 1న నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
దేశవ్యాప్తంగా మొత్తం 96.88 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 49.7 మంది పురుషులు కాగా, 47.1 మంది మహిళలు ఉన్నారు. 85 లక్షల మంది మహిళలు సహా 1.89 కోట్ల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇది కాకుండా, 13.4 లక్షల మంది అడ్వాన్స్డ్ దరఖాస్తుదారులు అంటే ఏప్రిల్ నాటికి 18 ఏళ్లు నిండిన వారు సైతం దరఖాస్తు చేసుకున్నారు.
మీ పోలింగ్ బూత్ను ఎలా కనుగొనాలి
నాలుగో విడతలో భాగంగా ఏపీ, తెలంగాణలోని మొత్తం 42 లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఏపీ అసెంబ్లీలోని 175 స్థానాలకు మే 13న(సోమవారం) ఎన్నికలు జరగనున్నాయి. తమ ఓటు హక్కుతో నేతల తల రాతను మార్చడానికి ఓటర్లు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దాదాపు అందరికీ ఓటర్ల స్లిప్పులు ఇంటికి వచ్చాయి. అందులో పేర్కొన్న వివరాల ఆధారంగా తమ పోలింగ్ బూత్ ఎక్కడుందో తెలుసుకొని ఓటు వేసేందుకు సిద్ధమయ్యారు.
అయితే ఇంటి చిరునామా మారడమో, మరే కారణాల వల్లగాని ఓటర్ స్లిప్ రాని వారు కూడా ఉన్నారు. అయితే ఓటర్ స్లిప్ రాలేనంత మాత్రాన ఓటు హక్కు కోల్పోవాల్సిన అవసరం లేదంటున్నారు ఎన్నికల సంఘం అధికారులు. మీకు ఓటర్ స్లిప్ రాకపోయినా, మీ పోలింగ్ బూత్ ఎక్కడుందో తెలుసుకొని ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఇందుకోసం కొన్ని రకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మీ పోలింగ్ బూత్ను ఎలా తెలుసుకోవాలంటే..
‘ఓటర్ హెల్ప్లైన్’ యాప్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. ఎన్నికల సంఘానికి చెందిన ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోని మీ ఓటరు గుర్తింపు కార్డు నెంబర్ను ఎంటర్ చేయడం ద్వారా వివరాలు పొందొచ్చు.
అలాగే ఎన్నికల సంఘం వెబ్సైట్స్ అయిన.. www.ceotelangana.nic.in లేదా www.electoralsearch.eci.gov.in వెబ్సైట్స్ ద్వారా కూడా పోలింగ్ కేంద్రాలను తెలుసుకోవచ్చు.
* ఇక ఎన్నికల సంఘం వెబ్సైట్ www.ceotelangana.nic.inలోకి వెళ్లి, అందులో ఉండే Ask Voter Sahaya Mithra చాట్బాట్ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు.
దశ 1: electoralsearch.eci.gov.in కు లాగిన్ చేసి , మీ పోలింగ్ స్టేషన్, అధికారిని తెలుసుకోవడానికి నావిగేట్ చేయండి.
దశ 2: బాక్స్లో ఓటర్ ID లేదా EPIC నంబర్ను నమోదు చేయండి.
దశ 3: Captcha నింపి ఎంటర్ చేయండి
దశ 4: మీరు బూత్ లెవల్ ఆఫీసర్, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, జిల్లా ఎన్నికల అధికారి పేరు, ఫోన్ నంబర్తో సహా వివరాలను చూడవచ్చు.
దశ 5: బూత్, అసెంబ్లీ నియోజకవర్గం, పార్లమెంటరీ నియోజకవర్గం వివరాలు కూడా పోర్టల్లో ఉన్నాయి.
అంతేకాకుండా 1950 టోల్ఫ్రీ నెంబర్కు కాల్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. మీ ఓటరు గుర్తింపు కార్డుపై ఉన్న నెంబర్ను 1950, 92117 28082 నంబర్లకు SMS రూపంలో పంపించాలి. వెంటనే మీ పోలింగ్ కేంద్రం వివరాలను ఎస్సెమ్మెస్ రూపంలో వెంటనే మీ ఫోన్కు పోలింగ్ కేంద్రం వివరాలు వస్తాయి.
ఓటర్ కార్డు లేకపోయినా పర్లేదు..
ఇక ఓటు వేయడానికి ఓటర్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఆధార్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, కేంద్ర, రాష్ట్ర, పబ్లిక్ సెక్టార్, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల ఫొటో గుర్తింపు కార్డు, ఫొటోతో కూడిన పోస్టాఫీస్ లేదా బ్యాంక్ పాస్బుక్, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, ఫొటోతో జత చేసిన పింఛను పత్రాలు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం వంటి వాటిలో ఏదైనా చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..