Hyderabad Metro Rail: మెట్రో అధికారులపై కిషన్ రెడ్డి ఆగ్రహం

|

Feb 14, 2020 | 4:54 PM

హైదరాబాద్ మెట్రో అధికారులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Hyderabad Metro Rail: మెట్రో అధికారులపై కిషన్ రెడ్డి ఆగ్రహం
Follow us on

Union Minister Kishanreddy anger on Hyderabad Metrorail Management: హైదరాబాద్ మెట్రో రైలు అధికారులపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దాంతో మెట్రో అధికారులపై మండిపడుతున్న కిషన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. బీజేపీ రాష్ట్ర నేతలతో కలిసి మెట్రో తనిఖీకి పూనుకున్నారు. ఇంతకీ కిషన్ రెడ్డి ఆగ్రహానికి కారణం ఏంటని పలువురు ఆరా తీస్తున్నారు.

మూడు రూట్లలో నిర్మాణమైన హైదరాబాద్ మెట్రోలో ఇటీవల మూడో మార్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేత ప్రారంభింపజేసిన సంగతి తెలిసిందే. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మధ్య నడిచే ఈ మెట్రో మూడో మార్గాన్ని ప్రారంభించిన మర్నాటి నుంచే ఈ మెట్రో రూటు అందుబాటులోకి వచ్చేసింది. ఇదంతా బాగానే వున్నా.. ఈ మెట్రో రూటు ఆల్ మోస్ట్ 90 శాతం సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోనే వుంది. ప్రారంభ కార్యక్రమం కూడా సికింద్రాబాద్ నియోజకవర్గంలోనే నిర్వహించారు.

కేంద్రంలో హోం శాక సహాయ మంత్రిగా పని చేస్తున్న కిషన్ రెడ్డి.. సికంద్రాబాద్ నుంచే లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. స్థానిక ఎంపీని, రాష్ట్రం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మంత్రిని అయిన తనకు మెట్రోరైలు ప్రారంభోత్సవానికి తగిన రీతిలో ఆహ్వానం పంపకపోవడమేంటన్నది ఇపుడు కిషన్ రెడ్డి ఆగ్రహానికి కారణమైంది. జేబీస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో ఓపెనింగ్ ప్రోగ్రామ్‌కు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం అందలేదకపోవడంతో కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతోపాటు బీజేపీకి చెందిన ఎమ్మెల్సీ రామచందర్ రావు కూడా స్థానికంగా వుంటారు. ఆయనకు కూడా పిలుపు ప్రాపర్‌గా వెళ్ళలేదని తెలుస్తోంది. ఒకవైపు పార్లమెంట్ నడుస్తుంటే ఇంకోవైపు ప్రారంభ కార్యక్రమాన్ని ఎలా పెట్టుకుంటారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

మెట్రో అధికారులపై తీవ్ర ఆగ్రహంతో వున్న కిషన్ రెడ్డి సహా కేంద్ర మంత్రులు శనివారం మెట్రో అధికారులతో సమీక్ష ఏర్పాటు చేశారు. దిల్‌కుశ అతిథి గృహంలో కిషన్ రెడ్డి సారథ్యంలో జరిగే మెట్రో రివ్యూలో మొత్తం పథకంలో కేంద్రం వాటా ఏంటో తెలియజెప్పడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తేవాలని బీజేపీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: TRS leaders in severe worry