
రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ గురువారం తీర్మానాన్ని ఆమోదించింది. అన్నదాతల న్యాయసమ్మతమైన కోర్కెలపై కేంద్రం దృష్టి సారించాలని, మూడు చట్టాలనూ ఉపసంహరించాలని ఈ తీర్మానంలో కోరారు. ఈ తీర్మానాన్ని ఆమోదించేందుకు ప్రత్యేకంగా సమావేశమైన సభలో దీన్ని ప్రవేశపెట్టిన సీఎం పినరయి విజయన్..వ్యవసాయం పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ తరుణంలో కేంద్రం పార్లమెంటులో మూడు చట్టాలను ఆమోదించిందని, వీటి ప్రభావం ఈ రంగంపై తీవ్రంగా ఉంటుందని అన్నారు. ఢిల్లీ నగరంలో ఎన్నడూ లేనివిధంగా భారీ ఆందోళన సాగుతోందని, ఈ నిరసనల వెనుక రైతుల పెద్ద అభీష్టం ఉందని ఆయన చెప్పారు. ఇప్పటివరకు ఇంతటి నిరసనను చూడలేదన్నారు. ఇప్పటికే 32 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు…. ప్రజలపై ప్రభావాన్నిచూపే, లేదా వారిలో అనుమానాలను రేకెత్తించే విషయాలపై చట్టాలు చేసే బాధ్యత చట్ట సభలకు ఉంది.. కేంద్ర ప్రభుత్వ అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం 43.3 శాతం వర్క్ ఫోర్స్ వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంది.. కానీ ఇది (వ్యవసాయం)కేవలం ఉత్పాదక రంగం మాత్రమే కాదు.మన సంస్కృతిలో భాగం అని విజయన్ వ్యాఖ్యానించారు.
వ్యవసాయ సంస్కరణలు జాగ్రత్తగా అమలు జరగాలని, ఈ చట్టాలను పార్లమెంట్ లో హడావుడిగా ఆమోదించారని చెప్పిన ఆయన.. మా ప్రభుత్వం, ఈ అసెంబ్లీ కూడా ఈ చట్టాలను రద్దు చేయాలని కోరుతోందని పేర్కొన్నారు.