విజయదశమి రోజున మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తనపై చేసిన విమర్శలను బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ గట్టిగా తిప్పికొట్టారు..ఉద్ధవ్ చేసిన ప్రతీమాటకు కౌంటర్ ఇచ్చారు కంగనా.. సొంత రాష్ట్రంలో తిండికి గతిలేని వారు ముంబాయికి వచ్చి డబ్బు సంపాదించుకుని, తిన్నింటివాసాలే లెక్కపెడుతున్నారని ఉద్ధవ్ చేసిన వ్యాఖ్యలపై కంగనా తీవ్రంగా మండిపడ్డారు.. హిమాలయాల సౌందర్యం భారతీయులందరికీ చెందినట్టుగానే ముంబాయి ఇచ్చే అవకాశాలు కూడా అందరికి చెందుతాయన్నారు కంగనా. హిమాచల్ప్రదేశ్ తనకెంతో మహారాష్ట్ర కూడా అంతేనని, రెండూ తన సొంత ఇళ్లేనని అన్నారు. పండుగ రోజున సీఎం స్థానంలో ఉన్న ఓ వ్యక్తి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసి మహారాష్ట్ర పరువు తీశారని కంగనా వ్యాఖ్యానించారు.. నిన్న దసరా మేళలో ఉద్ధవ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు కంగనా రనౌత్. తాను నెపోటిజం బ్రాండ్ కాదని, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న వ్యక్తినని చెప్పుకున్న కంగనా మీలా వారసత్వంతో అధికారంలో రాలేదని ఉద్ధవ్ను ఎత్తిపొడిచారు. మీలా తండ్రి పేరు చెప్పుకుని అధికారంలోకి రాలేదని, తాను కూడా గొప్ప కుటుంబానికి చెందినదానినేనని అన్నారు. తాను తండ్రి సంపాదనపై ఆధారపడి బతకాలనుకుంటే అక్కడే ఉండేదాన్ని అని కంగనా తెలిపారు. సొంత కాళ్లమీద నిలబడి, స్వయంశక్తితో ఈస్థాయికి ఎదిగానని అన్నారు. ప్రజాస్వామ్య హక్కులను హరించే సాహసానికి పూనుకోవద్దని సీఎంకు సూచించారు. అలాగే తమను విభజించవద్దని సీఎంను హెచ్చరించారు. గతంలో తనను సంజయ్ రౌత్ హరాంఖోర్ అన్నారని, ఇప్పుడు ఉద్ధవ్ నమక్ హరాం అంటున్నారని కంగనా మండిపడ్డారు. మీ కూతురులాంటిదాన్ని అని, తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి సిగ్గుండాలని ఘాటుగా అన్నారు కంగనా!