రాంగోపాల్ వర్మ.. పేరు చెపితే చాలు.. వివాదాస్పదాలకు కేరాఫ్ అడ్రస్ అని ప్రతి ఒక్కరికీ తెలిసిందే. వర్మ తీసే ఏ సినిమా అయినా సరే.. టైటిల్ నుంచే వివాదాలకు తెరలేపుతాడు. ఇక తాజాగా “కమ్మరాజ్యంలో కడపరెడ్లు” టైటిల్తో తెరకెక్కిస్తున్న మూవీ గురించి అసలు చెప్పక్కర్లేదు. సినిమా టైటిల్ పెడుతూనే కాంట్రవర్సీలకు తెరలేపాడు. కులాల పేరుతో ఈ చిత్రంకు టైటిల్ పెట్టడంతో.. అది కాస్త ఇప్పుడు కోర్టు మెట్లెక్కింది. ఈ చిత్రానికి పెట్టిన టైటిల్ ఓ కులాన్ని తక్కువచేసి చూపించేలా ఉందని.. అంతే కాకుండా.. తనను కూడా వ్యక్తిగతంగా కించపరిచేలా ఉందంటూ తెలంగాణ హైకోర్టు తలుపుతట్టారు క్రైస్తవ మతబోధకుడు, ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్. వెంటనే ఈ చిత్రాన్ని నిలిపివేయాలంటూ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అంతేకాదు ఈ సినిమా ఏపీలోని ప్రాంతీయ పార్టీలకు ముడిపడి ఉందని.. కొందరు రాజకీయ నాయకులను అవమానించేలా ఉందంటూ ఆరోపించారు. హైకోర్ట్కు దాఖలు చేసిన ఈ పిటిషన్లో కేంద్ర సమాచార శాఖ, సెన్సార్ బోర్డ్, రాం గోపాల్ వర్మ, జబర్దస్త్ కమెడియన్ రామును ప్రతివాదులుగా చేర్చారు.
కాగా, ఈ నెల 29న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు రాంగోపాల్ వర్మ ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండో ట్రైలర్ను బుధవారం యూట్యూబ్లో విడుదల చేయగా.. 3మిలియన్ వ్యూస్తో ట్రెండింగ్లో కొనసాగుతోంది.