సిరియా, ఇరాక్లలో ప్రాబల్యాన్ని కోల్పోతున్న ఉగ్రసంస్థ ఐసిస్.. తన మకాన్ని మార్చింది. భారత్, శ్రీలంకలే టార్గెట్గా దాడులు చేసేందుకు ఉగ్రవాదులు పథకాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళ పోలీస్ ఉన్నతాధికారులకు రాష్ట్ర ఇంటిలిజెంట్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ మూడు లేఖలను పంపారు. అందులో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, జమ్ము కశ్మీర్ రాష్ట్రాల్లో ఐసిస్ ఉగ్రవాదులు ఇప్పటికే మకాం వేశారని.. పలుచోట్ల దాడులు చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా చాట్ సెక్యూర్, సిగ్నల్, సైలెంట్ టెక్ట్స్ వంటి యాప్లను వాడుతూ.. తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని ఆ లేఖల్లో పేర్కొన్నారు.
దీనిపై పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాల్లో వందకు పైగా కేరళవాసులు ఐసిస్లో చేరారు. ఉగ్రవాదంవైపు ఆకర్షితులైన యువతను ఆ దారి నుంచి మళ్లించేందుకు 21 కౌన్సిలింగ్ కేంద్రాలు కృషి చేస్తున్నాయి. వారిలో ఎక్కువగా ఉత్తర కేరళ నుంచి ఉన్నారు అని తెలిపారు. 10 నుంచి 12 ఆన్లైన్ హనీ ట్రాప్ను ఏర్పాటు చేయడమే కాకుండా అంతర్గత భద్రతను పెంచేందుకు జిల్లా పోలీస్ అధికారులను విశేష అధికారాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్లలో 250మంది మరణించిన ఘటన అనంతరం ఉగ్రవాదులపై ఉక్కు పంజా వేసేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తుందని ఓ అధికారి వివరించారు.