ఆయనే నా రియల్ హీరో…: సీపీ అంజనీ కుమార్

భారీగా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరం.. జలనగరంగా మారిపోయింది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు, కాలనీలు వాగులను తలపిస్తున్నాయి. గతంలో లోతట్టు ప్రాంతాలను మాత్రమే వర్షం నీరు ముంచేసేది.. కానీ ఇప్పుడు సీన్ మారింది. అన్ని ప్రాంతాలు నీటిలో తేలుతున్నాయి...

ఆయనే నా రియల్ హీరో...: సీపీ అంజనీ కుమార్

Updated on: Oct 15, 2020 | 4:31 PM

భారీగా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరం.. జలనగరంగా మారిపోయింది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు, కాలనీలు వాగులను తలపిస్తున్నాయి. గతంలో లోతట్టు ప్రాంతాలను మాత్రమే వర్షం నీరు ముంచేసేది.. కానీ ఇప్పుడు సీన్ మారింది. అన్ని ప్రాంతాలు నీటిలో తేలుతున్నాయి.

అయితే ఈ వరద నీటిలో అన్ని ప్రాంతాలు జలదిగ్భందంలోకి చిక్కుకున్నాయి. ఇలా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ఇంట్లోకి వరద నీరు చేరడంతో, నాలుగు రోజులుగా ఆయన ఆఫీసులోనే ఉంటూ డ్యూటీ నిర్వహిస్తున్నారు. మరో 300 మంది పోలీసు అధికారుల ఇళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు తమ కుటుంబాలు వరద నీటిలో చిక్కుకున్నప్పటికీ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు.

ఇక నగరంలోని ప్రస్తుత పరిస్థితి గురించి సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు.‌ వరద సహాయక చర్యల కోసం ముమ్మర ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మూసి లోతట్టు ప్రాంతంలో కొన్ని చోట్ల వరద నీరు ఉందని, కుల్సుంపుర, కార్వాన్, తప్పాచపుత్ర, అఫ్జల్‌గంజ్‌, మలక్‌పేట్‌, చాదర్‌ఘాట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం వరద ఉధృతి కాస్త ఎక్కువగానే ఉన్నట్లు పేర్కొన్నారు. ఫలక్‌నామా ఏరియాలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు. ముంపు ప్రాంతాల్లో పోలీసులు విస్త్రృత సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. అదే విధంగా రెస్క్యూ ఆపరేషన్‌ జరుగుతున్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అవసరమైతే తప్ప ప్రజలు ఎవరు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.

‘‘చిక్కడ్‌పల్లి పోలీస్‌ కానిస్టేబుల్‌ వీరేందర్‌ నా హీరో. వరద నీటిలో చిక్కుకుపోయిన 25 మందిని ఆయన కాపాడారు. అరవింద్‌ నగర్‌, దోమలగూడ వద్ద ఇది జరిగింది. ఇలాంటి ఆఫీసర్లే మా బృందంలో ఉన్న నిజమైన స్టార్లు. ఆయనకు సెల్యూట్‌ చేస్తున్నా. అలాగే హైదరాబాద్‌ పోలీసులకు ప్రోత్సాహం అందిస్తున్న ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు’’ అంటూ సీపీ అంజనీ కుమార్‌ కానిస్టేబుల్‌ వీరేందర్‌పై ప్రశంసలు కురిపించారు.