విదేశీ ఆయుధాలతో పట్టుబడిన వేటగాళ్లు..షికారు చేస్తుండగా పట్టుకున్న నిజామాబాద్ ఫారెస్ట్ అధికారులు
వేటగాళ్ల చేతిలోకి ఆ తుపాకులెలా వచ్చాయ్..? అటవీ ప్రాంతంలో తుపాకులతో పనేంటి..? నిజామాబాద్ జిల్లా వర్ని ప్రాంతంలో దొరికిన తుపాకులు ప్రస్తుతం కలకలం సృష్టిస్తున్నాయి. వేటగాళ్ల చేతిలోని తుపాకులను చూసి షాకవడం ఫారెస్ట్ ఆఫీసర్ల వంతైంది.
సండే రోజు అడవిలో షికారు చేద్దామని అనుకున్న వేటగాళ్లను నిజామాబాద్ ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. వర్ని అటవీ ప్రాంతంలో తుపాకులతో హల్చల్ చేస్తున్న కొందరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అఫండి రైస్మిల్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హాబీబ్ ఖాన్ దాడుల్లో ఈ తతంగం బయటపడింది.. తుపాకులతో పాటు నిందితుల్ని నిజామాబాద్ జిల్లా ఫారెస్ట్ అధికారులకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అప్పగించి వెళ్లారు.
జకోరా గ్రామంలో హైదరాబాద్ వేటగాళ్లు తుపాకులతో ఎంట్రీ ఇచ్చారు. లైసెన్స్ తుపాకులతో అడవి జంతువులను వేటాడుతూ నిందితులు హల్చల్ చేశారు. ఐదుగురు వ్యక్తుల వద్ద రెండు తుపాకులను హైదరాబాద్ ఫారెస్ట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్కు చెందిన లుక్మాన్ ఆపేంది సహా నలుగురు వేటగాళ్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరు వర్ని అటవీ ప్రాంతంలో వేటకు వెళ్తున్నారని అనుమానిస్తున్నారు అధికారులు.
ఇక.. ఫారెస్ట్ ఆఫీస్లో వేటగాళ్లు దౌర్జన్యానికి దిగడం విస్మయానికి గురిచేస్తోంది. వేటగాళ్లు దొరికారు అనే సమాచారంతో ఫారెస్ట్ ఆఫీసుకు వచ్చిన మీడియా ప్రతినిధులపై విరుచుకుపడ్డారు. వేటగాళ్లు పట్టుబడడం ఒక ఎత్తయితే.. వారికి ఫారెస్ట్ అధికారులు బిర్యానీ వడ్డించడం మరో సంచలనంగా మారింది. వేటగాళ్ల వద్ద నుంచి కుందేలు మాంసం, విదేశీ ఆయుధాలు, కారు స్వాధీనం చేసుకున్నారు అధికారులు.