
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు అగ్రనేతలు కాపు కాశారు. మావో అగ్రనేతలైన చలపతి, అరుణ, నవీన్ అక్కడే ఉన్నారని భద్రతాబలగాలకు సమాచారం అందడంతో.. వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
మరోవైపు సీలేరులో ఇద్దరు హోంగార్డులు మావోయిస్టులకు సహకరిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీంతో విశాఖ మన్యంలో హై అలర్ట్ కొనసాగుతోంది. కాగా శనివారం ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు మందుపాతర పేల్చిన ఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడిన విషయం తెలిసిందే.