
ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఒకవైపు… వ్యాక్సినేషన్ ప్రక్రియ మరోవైపు సాగుతోంది. భారత దేశంలో సైతం వ్యాక్సిన్ల తయారీ, క్లినికల్ ట్రయల్స్, ప్రపంచ దేశాల వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగానికి దరఖాస్తులు ఇలా పలు దశల్లో కరోనాపై పోరు కొనసాగుతోంది…
కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మాట్లాడుతూ… ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోందన్నారు. వ్యాక్సిన్ వినియోగంలో ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అన్నీ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటుందని ఎదురు చూస్తున్నామని అన్నారు. అంతేకాకుండా దేశ ప్రజల ఆరోగ్య సంరక్షణే ముఖ్యమని అన్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా అక్కడక్కడ పిల్లలు, గర్భవతులకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వగా ప్రతికూల ఫలితాలు వచ్చాయని తెలిపారు. అందుకే కొద్దిగా కరోనా వ్యాక్సినేషన్ విషయంలో వెనకాడుతున్నామని తెలియజేశారు. బ్రిటన్లో ప్రతికూల ఫలితాలు అధికంగా వచ్చాయని తెలిపారు.
కరోనా ఆపత్కాలంలో టీకా వినియోగం కోసం దరఖాస్తు చేసుకున్న ఫైజర్, సీరం, భారత్ బయోటెక్ అభ్యర్థలను భారత డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ పరిశీలిస్తోందని రాజేష్ భూషణ్ తెలిపారు. కాగా, కేంద్రం టీకా వినియోగానికి అవసరైన 240 కూలర్లు, 70 వాక్ ఇన్ ఫ్రిజ్లు,45,000 ఐస్ రిఫ్రిజ్రేటర్లు, 41,000 ఫ్రీజర్లు, 300 సోలార్ రిఫ్రిజ్రేటర్లు అందుబాటులో ఉంచిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్రాల పరిధిలోని 23 విభాగాలను కరోనా టీకా అందుబాటులోకి తేవడానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.