
పసిబిడ్డను కంటికి రెప్పలా చూసుకోవలసిన తండ్రి.. అంగట్లో సరుకులా అమ్మేశాడు. మద్యం మత్తులో డబ్బు కోసం బిడ్డను అమ్మ చెంత నుంచి దూరం చేశాడు. తల్లడిల్లిన ఆ తల్లి పోలీసులను ఆశ్రయించగా వారు క్షేమంగా తీసుకొచ్చి అప్పగించారు. మలక్పేట నల్గొండ చౌరస్తా సమీప చర్చి వద్ద భిక్షాటన చేస్తూ బతుకుతున్న దంపతులకు రెండునెలల మగ శిశువు ఉన్నాడు. గతనెల 26న ముగ్గురు మహిళలు మద్యం మత్తులో ఉన్న చిన్నారి తండ్రికి 70 వేలు ఇచ్చి పసికందును తీసుకెళ్లారు. బిడ్డ కనిపించక అంతటా వెతికిన తల్లి అదేరోజు రాత్రి 12 గంటలకు చాదర్ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు చేపట్టారు. ఎల్బీనగర్ పరిధి ఎన్టీఆర్నగర్కు చెందిన ముగ్గురు మహిళలు శిశువును తీసుకెళ్లినట్లుగా గుర్తించి, బిడ్డను క్షేమంగా తల్లికి అప్పగించారు పోలీసులు. నిందితులపై కేసు నమోదుచేశారు.