ఎంతోమంది పిల్లలు,యువకుల ప్రాణాలు కోల్పోడానికి కారణమవుతున్న పబ్జీ గేమ్ను వెంటనే నిషేదించాలని బాలల హక్కుల సంఘం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. పబ్జి గేమ్ ఆడుతూ దానికి బానిసలుగా మారిపోతున్నారని, ఇటువంటి ఆన్లైన్ గేమ్స్తో తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భయంకరమైన ఈ పబ్జీ గేమ్కు అలవాటు పడి ఎంతోమంది చిన్నారులు తమ జీవితాలను పణంగా పెడుతున్నారని అచ్యుతరావు పేర్కొన్నారు. తాజాగా విజయనగరంలో లోహిత్ అనే విద్యార్ధి ఈ గేమ్కు బానిసగా మారి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన తెలిపారు.
సమాజంలో ఎంతోమంది యువకులు, పిల్లల ప్రాణాలను బలితీసుకుంటున్న ఈ పబ్జీ గేమ్ను సామాజిక బాధ్యతతో స్మార్ట్ఫోన్ కంపెనీలు తమ ఫోన్లలో ఆప్షన్ ఇవ్వకూడదంటూ విఙ్ఞప్తి చేశారు. పబ్జీ గేమ్ను నిషేదించాలంటూ కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అదే విధంగా జువైనల్ జస్టిస్ యాక్ట్ పరిధిలోకి దీన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని అచ్యుతరావు తెలిపారు.
పబ్జీ గేమ్ మాయలో పడి ఎంతో మంది యువకులు తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. తమకు తాము ఆత్మహత్యలు చేసుకోవడమో.. లేక ఎదుటి వారిని చంపడమో చేస్తున్నారు. రెండు రోజుల క్రితం కన్నతండ్రిని ఓ యువకుడు తల నరికాడు. ఇటువంటి ఎన్నో సంఘటనలు ఈ గేమ్ ప్రభావంతో ఘోరాలకు పాల్పడుతున్నారు. ఈ గేమ్ను నిషేదించాలంటూ ఇప్పటికే అనేక ఫిర్యాదులు కేంద్ర ప్రభుత్వానికి అందాయి. ప్రభుత్వం ఇటువంటి ప్రాణాంతక గేమ్లపై ఉక్కుపాదం మోపాలని బాలల హక్కుల సంఘాల వంటి అనేక సామాజిక సంస్ధలు కోరుతున్నాయి.