CM Revanth Reddy: నర్మెట్ట పామాయిల్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం అదే వేదికపై నుంచి రైతులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రైతుభరోసా తొలి విడత నిధులను కూడా ఆయన విడుదల చేశారు. సోమవారం రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమకానున్నాయి.

సిద్దిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీజీ ఆయిల్పామ్ కర్మాగారాన్ని ఆయన ప్రారంభించారు. రూ.300 కోట్లతో నిర్మించిన ఈ ఫ్యాక్టరీ తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు కొత్త దశను తీసుకురానుంది. మలేషియా సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ ఫ్యాక్టరీ దేశంలోనే అత్యాధునికమైన వాటిలో ఒకటిగా నిలుస్తుంది. గంటకు 30 నుంచి 120 టన్నుల వరకు ఆయిల్ పామ్ గెలలను ప్రాసెస్ చేసే సామర్థ్యంతో నిర్మించిన ఈ ఫ్యాక్టరీ రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది.
నర్మెట్ట పామాయిల్ ఫ్యాక్టరీలో క్రూడ్ పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ తయారీతో పాటు 4 మెగావాట్ల సామర్థ్యంతో బయో పవర్ ప్లాంట్, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానంలో పనిచేసే నీటి శుద్ధి కేంద్రం వంటి అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఆయిల్ పామ్ గెలల నుంచి నూనె ఉత్పత్తి ప్రక్రియలో మిగిలే వ్యర్థాలను వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే విధానాన్ని కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో సుమారు 2.91 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు అవుతుండగా 14 కంపెనీలు ఆయిల్ పామ్ సాగు అభివృద్ధికి పనిచేస్తున్నాయి.
ఆయిల్ ఫెడ్ పరిధిలోనే దాదాపు 42,758 మంది రైతులు, 1.8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోనే 14,361 ఎకరాల్లో 4,469 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించి, కేవలం 18 నెలల రికార్డు సమయంలోనే పనులు పూర్తి చేశారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా ఆయిల్ పామ్ రైతుల ఆదాయం పెరగడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
