AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్ గూటికి చెరుకు ఫ్యామిలీ..! దుబ్బాకే టార్గెట్

తెలుగుదేశం పార్టీలో చిరకాలం కొనసాగి చివరికి కాంగ్రెస్ పార్టీలో చేరి.. జీవిత చరమాంకంలో తెలంగాణ రాష్ట్ర సమితికి దగ్గరైన మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి ఫ్యామిలీ...

కాంగ్రెస్ గూటికి చెరుకు ఫ్యామిలీ..! దుబ్బాకే టార్గెట్
Rajesh Sharma
|

Updated on: Oct 05, 2020 | 1:40 PM

Share

Cheruku Family into Congress party: తెలుగుదేశం పార్టీలో చిరకాలం కొనసాగి చివరికి కాంగ్రెస్ పార్టీలో చేరి.. జీవిత చరమాంకంలో తెలంగాణ రాష్ట్ర సమితికి దగ్గరైన మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి ఫ్యామిలీ ఇపుడు కాంగ్రెస్ గూటికి చేరే సంకేతాలు కనిపిస్తున్నాయి. చిరకాలంగా రాజకీయాల్లో వున్న చెరుకు ముత్యంరెడ్డి కొంత కాలం క్రితం మరణించగా.. ఆయన ఫ్యామిలీ  కొంతకాలంగా టీఆర్ఎస్‌లో కొనసాగుతోంది.. ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో చెరుకు ఫ్యామిలీ కాంగ్రెస్ గూటికి చేరువవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

మెదక్ జిల్లాలో గతంలో దొమ్మాట పేరిట వున్న అసెంబ్లీ సెగ్మెంట్.. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తర్వాత దుబ్బాక నియోజక వర్గంగా మారిన సంగతి తెలిసిందే. దొమ్మాటగా వున్నప్పుడు చాలా కాలం అక్కడి నుంచి చెరుకు ముత్యం రెడ్డి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో దూసుకు వచ్చిన సోలిపేట రామలింగారెడ్డి.. ముత్యంరెడ్డిని ఓడించి అసెంబ్లీకి చేరారు. 2004లో తొలిసారి ముత్యంరెడ్డి ఆధిపత్యానికి తెరపడి.. రామలింగారెడ్డి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లో రామలింగారెడ్డిపై ముత్యంరెడ్డి గెలుపొందారు.

ఆ తర్వాత కాలంలో రామలింగారెడ్డి వరుస విజయాలతో కొనసాగి.. ఇటీవల అనారోగ్యంతో మరణించారు. అటు ముత్యంరెడ్డి కూడా జీవిత చరమాంకంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంతో అమెరికాలో వైద్యం చేయించుకున్నారు. కానీ అదే అనారోగ్యంతో ఆయన మరణించారు. కేసీఆర్ చేసిన సాయం కారణంగా ముత్యంరెడ్డి ఫ్యామిలీ టీఆర్ఎస్‌కు చేరువైంది. ముత్యంరెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగారు.

తాజాగా రామలింగారెడ్డి మరణంతో జరుగుతున్న ఉప ఎన్నిక సందర్భంగా దుబ్బాక నియోజకవర్గంలో మారిన సమీకరణలతో కాంగ్రెస్ పార్టీ చెరుకు ఫ్యామిలీకి గాలమేస్తున్నట్లు సమాచారం. లేటెస్ట్ సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీలోకి చెరుకు ముత్యం రెడ్డి కొడుకు చెరుకు శ్రీనువాస్ రెడ్డి చేరిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. దుబ్బాక నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తామని టీపీసీసీ.. శ్రీనివాస్ రెడ్డికి హామీ ఇచ్చినట్లు సమాచారం. సోమవారం గాంధీభవన్‌లో మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలతో సమావేశమైన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి..  చెరుకు శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయనున్నారు. ఆ వెంటనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది.

Follow Us