న్యూఢిల్లీ: ప్రధాని మోడీపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శల దాడిని కొనసాగించారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన నిరసన కార్యక్రమానికి చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానికి కనీస పరిపాలన సూత్రాలు కూడా తెలియవని అన్నారు. ఆయన ఎక్కడ డిగ్రీ చదివారో చెప్పగలరా అని ప్రశ్నించారు.
మోడీ పాలనలో దేశంలో రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నారని, సహకార వ్యవస్థ దెబ్బ తిందని అన్నారు. నోట్ల రద్దు నిర్ణయంతో దేశ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా నాశనమైందన్నారు. మోడీ పాలనలో హక్కులు, స్వేచ్ఛను కోల్పోయాం. విపక్ష నేతలపైన దాడులు జరిగాయి. బిజెపి నేతలపై మాత్రం ఏ దాడి జరలేదు. మోడీ పాలనకు వ్యతిరేకంగా తామంతా ఏకమయ్యామని, మోడీ ఇక రోజులు లెక్కపెట్టుకోవాలని చంద్రబాబు అన్నారు.